బాలీవుడ్‌కి వెళుతున్న ఇస్మార్ట్ శంక‌ర్

పూరి సినిమా బాలీవుడ్‌కి

బాలీవుడ్ లో తెలుగు సినిమాల రీమేక్ లు క్లాసిక్ డేస్ నుంచి ఉన్నా.. పోకిరి చిత్రంతో మ‌రో స్థాయి సాధ్య‌మైంది. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పోకిరి.. సూర్య న‌టించిన గ‌జిని చిత్రాలు బాలీవుడ్ లో బంప‌ర్ హిట్లు కొట్టాయి. అక్క‌డ అగ్ర క‌థానాయ‌కుల‌కే బోలెడంత మైలేజ్ ని ఇచ్చిన చిత్రాలివి. అందుకే బాలీవుడ్ వాళ్ల‌కు తెలుగు సినిమాలంటే గౌర‌వం పెరిగింది. ఇటీవ‌లి కాలంలో బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత సీన్ తెలిసిందే. టాలీవుడ్ హిట్ సినిమాల రీమేక్ ల‌పైనే హిందీ నిర్మాత‌లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
 
అర్జున్ రెడ్డి చిత్రం క‌బీర్ సింగ్ పేరుతో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 2019 లో టాప్ 5 హిట్ చిత్రాల్లో టాప్ పొజిష‌న్ లో నిలిచింది. ప్ర‌స్తుతం జెర్సీ, ఆర్ఎక్స్100 చిత్రాలు రీమేక‌వుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ రీమేక్ చేయ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇటీవ‌లే రిలీజై బంప‌ర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అక్క‌డ యంగ్ హీరో రణబీర్ కపూర్ ఈ రీమేక్ లో న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఎన‌ర్జిటిక్ హీరో రామ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ మాస్ లో మాసివ్ హిట్ సాధించింది. ఈ సినిమా ఇటు రామ్ కి.. అటు పూరికి కెరీర్ ప‌రంగా ప్రాణం పోసింద‌నే చెప్పాలి. ఓ వైపు క‌బీర్ సింగ్ ఫేం సందీప్ వంగా చిత్రంలో రణబీర్ న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈలోగానే పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇస్మార్ట్ శంక‌ర్ పైనా అత‌డు ఆస‌క్తిగా ఉన్నాడ‌న్న వార్త ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును హిందీలో ఎవ‌రు తెర‌కెక్కిస్తారు అన్న‌దానిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.