క్షమాపణ చెప్పిన విజయ్ దేవరకొండ

మన సౌతిండియాలో హీరోలను దేవుళ్లతో సమానంగా ఆరాధిస్తూంటారు. కేవలం వాళ్లు నటించిన సినిమాలు చూసి ఊరుకోకండా వాటిని తమ జీవితంలోకు ఆహ్వానిస్తూంటారు..అనుసరిస్తూంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్యాన్స్ పరిస్దితి కూడా అదే. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ అయిపోయాడు.

గీతగోవిందం తర్వాత ఫాలోయింగ్ రెట్టింపైంది. సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. దానికి తోడు ఇటీవలే రౌడీ పేరుతో బ్రాండ్ పాపులర్ చేసారు. దాంతో ఫ్యాన్స్ అంతా ఈ రౌడీని ఫాలో అయిపోయారు. అది విజయదేవరకొండ బహిరంగంగా క్షమాపణ చెప్పేదాకా పరిస్దితి తెచ్చిపెట్టింది.

అసలు విషయంలోకి వస్తే..ఇద్దరు కుర్రోళ్లు బుల్లెట్ పై వెళుతున్నారు. ఆ బండికి నెంబర్ లేదు. రౌడీ అని రాసి ఉంది. వీళ్లు ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడ్డారు. వెంటనే ఆపారు. ఫైన్ వేశారు. అంతేకాకుండా రౌడీ బండిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ నెంబర్ ప్లేట్ ను నిబంధనలకు అనుగుణంగా ఫిక్స్ చేసుకోవాలి.. అందుకు విరుద్ధంగా ఉంటే CMV Rule 50 & 51 కింద జరిమానా విధించటం జరుగుతుంది. దీనిపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తాం అని ప్రకటించారు.

ఈ విషయం తెలుసుకున్న హీరో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలో రియాక్ట్ అయ్యారు. వాళ్ల తరఫున నేను సారీ చెబుతున్నా.. ఇలాంటి పనులు చేయకుండా అందరిలో చైతన్యం తీసుకొస్తా.. ట్రాఫిక్ రూల్స్ అందరికీ తెలిసేలా నా వంతు కృషి చేస్తాను. ఈ కుర్రోళ్ల తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను అని పోస్టు చేశాడు. ఇక హీరో విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.