‘ఎన్టీఆర్ బయోపిక్’: స్వీయ డైరక్షన్ లో నటిస్తున్న క్రిష్..పాత్ర ఏంటంటే

దర్శకుడు క్రిష్ మరోసారి వెండితెరపై కనిపించి అలరించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’లో ఓ కీలకమైన పాత్రలో కనిపిచనున్నారు. అలాగే ఆ పాత్ర పూర్తి ఎమోషన్స్ తో సాగనుంది. ఇంతకీ ఆ పాత్ర మరేదో కాదు…డైరక్టర్ కేవీ రెడ్డి.

అవును..ఇంతకు ముందు కూడా క్రిష్ అదే పాత్రలో మహానటి చిత్రంలో కనిపించారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి..కెవీ రెడ్డిగారిని తలపించారని చాలా మంది ప్రశంశించారు. ఈ నేపధ్యంలో తన దర్శకత్వంలో  నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘ఎన్టీఆర్ బయోపిక్’లోనూ ఆయన్నే చేయమని యూనిట్ పట్టుపట్టింది. వేరే వారిని అనుకున్నారు కానీ సెట్ కావటం లేదని ఆయనే చేస్తున్నారు.

లెంజెండరీ దర్శకుడైన కేవీ రెడ్డిగారి పాత్రలో ఆయన  మరోసారి కనిపించబోతున్నారు. ఈ సీన్స్ ను ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోనే షూట్ చేయబోతున్నారు.

అయితే మహానటి చిత్రంలో కేవీ రెడ్డి పాత్రకి ఈ పాత్రకీ చాలా వ్యత్యాసముంది. ఈ బయోపిక్   చిత్రంలో  అరవై సంవత్సరాల వయస్సులో ఉన్న కేవీ రెడ్డిగారి పాత్రను పోషించబోతున్నారు. కేవీ రెడ్డిగారు చివరి రోజుల్లో ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను, అప్పటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారు.అలాగే కేవీ రెడ్డిగారు ఎన్టీఆర్ గారు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నారు.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం రెండు పార్ట్ గా రెడీ అవుతోంది. ఈ సినిమాని  వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చెయ్యడానికి సన్నద్ధం అవుతుంది చిత్ర యూనిట్.