వైరల్ వీడియో: ‘నరికి పోగులుపెడతా’ రెచ్చిపోయిన బాలయ్య

సినీ నటుడు, తెలుగుదేశం పార్టి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన ధోరణిలో చిందులు తొక్కి వార్తలకు ఎక్కారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగన సంఘటన మరోసారి బాలయ్య ని విలన్ ని చేసింది. ఒక మీడియా ప్రతినిధిపై విరుచుకుపడటం, ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేవటం అందరి చేతా విమర్శలు గురి అవుతోంది.

వివరాల్లోకి వెళితే… ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగారు. దీన్ని షూట్‌ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టడం మొదలెట్టారు. కెమెరాతో చిత్రీకరించిన ఆ సన్నివేశాన్ని తొలగించాలని మీడియా ప్రతినిధిపై కోపంతో చేయి చేసుకున్నారు.  

‘రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు’ అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యి…వైరల్ అయ్యాయి.

ఇక చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీడియా ప్రతినిధిపై బాలకృష్ణ దౌర్జన్యాన్ని జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఎన్నికల సంఘం బాలకృష్ణ మానసిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశ, నిస్పృహతో బాలకృష్ణ ఇలా ప్రవర్తిస్తున్నారని ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు.