మురళిమోహన్ కోడలికు మద్దతుగా నారా రోహిత్

హీరో నారా రోహిత్ ఎలక్షన్ క్యాంపైన్ లో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున ఆయన ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీయేనని, మరోసారి చంద్రబాబు సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని నారా రోహిత్ వ్యాఖ్యానించారు.

రాజమహేంద్రవరం లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మురళీమోహన్ కోడలు మాగంటి రూపకు మద్దతుగా సీతానగరం, రఘుదేవపురం ప్రాంతాల్లో ప్రచారం చేసిన రోహిత్, మంచి చేసే నేతలను ప్రజలు ఎన్నటికీ మరచిపోబోరని అన్నారు.

నాలుగో తేదీన తణుకు, గురజాల, సత్తెనపల్లి, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. ఐదో తేదీన రేపల్లె, తెనాలి, పత్తిపాడులో, ఆరో తేదీన చిలకలూరిపేట, పర్చూరు, చీరాలలో జరిగే ప్రచారంలో పాల్గొంటారు. ఏడో తేదీన ఉరవకొండ, రాయదుర్గం, పుట్టపర్తి, ఎనిమిది, తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లాలో నారా రోహిత్ ప్రచారం చేయనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధే ఓట్లను కురిపిస్తుందని, చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ సంక్షేమాన్ని దగ్గర చేసిందని రోహిత్ వ్యాఖ్యానించారు. పథకాల లబ్ధిదారులంతా టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేశ్ కూడా పాల్గొన్నారు.

అలాగే చాగల్లు మండలంలోని కలవలపల్లి, రాచంద్రాపురం, బ్రాహ్మణగూడెం తదితర గ్రామాల్లో సినీ హీరో నారా రోహిత్‌ బుధవారం పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.