125 కోట్లతో 5 భాషల్లో

నటుడు తనే సొంతంగా చిత్రం చేసి తానేంటో నిరూపించుకోగలడు. ప్రస్తుతం శింబు అదే చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈయన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సురేష్‌ కామాక్షి నిర్మించతలపెట్టిన ‘మానాడు’ అనే చిత్రంలో నటించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. మధ్యలో ఆగిపోయిందనే ప్రచారం జరగడంతో నిర్మాత సురేష్‌ కామాక్షీ మానాడు చిత్రం ఆగిపోలేదు, షూటింగ్‌ జరుగుతోందని వివరణ ఇచ్చారు.అలాంటిది ఇటీవల సడన్‌గా అనివార్యకారణాల వల్ల శింబుతో మానాడు చిత్రం చేయడం లేదని ప్రకటించారు.

అయితే వేరే నటుడితో మానాడు చిత్రం ఉంటుందని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే ఆ వెంటనే శింబు అభిమానులను ఖుషీ చేసే వార్త వెలువడింది. ఎప్పుడైతే మానాడు నుంచి శింబును తొలగించిన వార్త ప్రచారం అయిందో ఆ వెంటనే శింబు తండ్రి టి.రాజేందర్‌ స్పందించారు. మానాడు పోతేనేం శింబు ‘మహా మానాడు’తో వస్తున్నాడు అని వెల్లడించి షాక్‌ ఇచ్చారు. అవును శింబు హీరోగా మహా మానాడు చిత్రం తెరకెక్కనుందని, ఆ చిత్రాన్నిశింబునే స్వీయ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిపారు.
తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది అంతేకాదు ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌లో తమిళంతో పాటు ఐదు భాషలో రూపొందించనున్నట్లు సమాచారం.