సుక్కు ఇప్ప‌టికీ త‌గ్గ‌ట్లేదుగా!

ఇండ‌స్ట్రీలో శాశ్వ‌త మిత్రులు, శత్రువులు అంటూ వుండ‌రంటారు. వాతావ‌ర‌ణం, అవ‌కాశాలు,
స‌క్సెస్‌ని బ‌ట్టి ప్ర‌తీ శుక్రవారం స‌మీక‌ర‌ణాల్నీ ఇక్క‌డ మారిపోతుంటాయి. అయితే అప్పుడ‌ప్పుడు మాత్రం కొన్ని కాలం మార్చేంత వ‌ర‌కు మార‌వు. మ‌హేష్‌, సుకుమార్‌ల మ‌ధ్య న‌లుగుతున్న అంశం కూడా అలాంటిదే. మ‌హేష్‌, సుకుమార్ తొలిసారి క‌లిసి `వ‌న్ నేనొక్క‌డినే` చిత్రానికి ప‌నిచేశారు. సుక్కు చెప్పిన క‌థ‌కు ముగ్ధుడైన మ‌హేష్ త‌న చిన్నాన్న‌నాటి పాత్ర‌ని త‌న త‌న‌యుడు గౌత‌మ్‌తో చేయించాడు. ఇంత చేసినా సినిమాలో బ‌ల‌మైన క‌థ, క‌థ‌నాలు లేక‌పోవ‌డంతో సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో క్లోజ్ ఫ్రెండ్స్‌లా వున్న మ‌హేష్‌, సుకుమార్ ఫ‌లితం త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద అగాధ‌మే ఏర్ప‌డింది. ఆ త‌రువాత ఇద్ద‌రు క‌లిసి మ‌రో సినిమా చేస్తామ‌ని మీడియా సాక్షిగా చెప్పారు. `రంగ‌స్థ‌లం` స‌క్సెస్ త‌రువాత మ‌హేష్‌తో సుకుమార్ సినిమా చేయాల‌నుకున్నారు. ఇక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే ఆల‌స్యం.. క‌ట్ చేస్తే కొన్ని క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా త‌ను సుకుమార్‌తో సినిమా చేయ‌డం లేద‌ని మ‌హేష్ ఓపెన్‌గా ప్ర‌క‌టించి వెంట‌నే వంశీ పైడిప‌ల్లితో సినిమాని ప‌ట్టాలెక్కించారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన సుక్కు ఆగ‌మేఘాల మీద బ‌న్నీతో సినిమా ఓకే చేయించుకుని వెంట‌నే మీడియా ప్ర‌క‌ట‌న ఇప్పించాడు. దీనికి బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా మ‌హేష్‌కి కూడా మండిందంట‌. అప్ప‌టి నుంచి సుకుమార్‌ని మ‌హేష్ అవైడ్ చేయ‌డం మొద‌లుపెట్టార‌ట‌. ఇద్ద‌రి మ‌ధ్య ఎంత దూరం పెరిగిపోయిందో తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఈ సంక్రాంతికి మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`, బ‌న్నీ `అల వైకుంఠ‌పుర‌ములో` ఒక్క రోజు తేడాతో విడులైన విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించాయి. బ‌న్నీకి మాత్ర‌మే విషెస్ చెప్పిన సుకుమార్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాని కానీ, మ‌హేష్  ని కానీ ప్రస్థావించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యం తెలిసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం సుక్కు ఇప్ప‌టికీ త‌గ్గ‌ట్లేదుగా అని ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌.