రౌడీ ప‌క్క‌న బాలీవుడ్ పోరి ఫిక్స్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్‌జోహార్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై పూరిజ‌గ‌న్నాథ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ముంబైలో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇందులో బాక్స‌ర్‌గా క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే. `ఫైట‌ర్‌` పేరుని ఈ చిత్రానికి ఫైన‌ల్ చేశారు.

వ‌రుస ఫ్లాపుల‌తో కెరీర్ స్ట్ర‌గుల్స్‌లో వున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాకు సంబంధించి ఏ విష‌యం లోనూ ఛాన్స్ తీసుకోవ‌డం లేద‌ట‌. ఏ విష‌యంలోనూ రాజీప‌డకుండా శ్ర‌మిస్తున్న‌ట్టు చెబుతున్నారు. తాజా న‌టించిన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో `ఫైట‌ర్‌`పైనే ఆశ‌లు పెట్టుకున్నాడ‌ట. పాన్ ఇండియా స్థాయిలో పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా బాక్సింగ్‌కు సంబంధించిన రింగ్ సెట్‌ల‌ని సిద్ధం చేశారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీక‌పూర్ న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండేని ఫైన‌ల్ చేశార‌ని టీమ్ నుంచి ఫీల‌ర్స్ వ‌చ్చాయి. అయితే ఇంత వ‌ర‌కు ఆమెకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బ‌య‌టికి రాలేదు. తాజాగా అన‌న్య పాండే గురువారం ఈ చిత్ర సెట్లోకి ఎంట‌రైంది. ఈ సంద‌ర్భంగా ఆమెకి వెల్క‌మ్ చెబుతూ ద‌ర్శ‌కుడు పూరి కొన్ని ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశాడు. ఈ ఫొటోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే, చార్మి, పూరిజ‌గ‌న్నాథ్ వున్నారు.