మ‌ళ్లీ పాట పాడుతున్న ప‌వ‌న్‌!

త‌మ్ముడు, ఖుషీ, జానీ, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో ప‌వ‌న్ గొంతు స‌వ‌రించి పాటందుకున్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా మ‌ళ్లీ కొత్త సినిమా కోసం పాట పాడ‌బోతున్నాడ‌ట‌. రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస‌గా సినిమాల్ని లైన‌ప్ చేశారు. ముందు `పింక్‌` రీమేక్‌ని మొద‌లుపెట్టిన ప‌వ‌న్ ఆ వెంట‌నే క్రిష్ చిత్రాన్ని కూడా సైలెంట్‌గా స్టార్ట్ చేసేశారు. 18వ శ‌తాబ్దానికి చెందిన మొఘ‌ల్‌ కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ సినిమాని రూపొందుస్తున్నారు.

తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ‌ల సాయ‌న్న క‌థ ఆధారంగా పిరియాడిక్ స్టోరీగా ఏ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే సెట్‌ల‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప‌వ‌న్ పాట‌పాడ‌బోతున్నార‌ట‌. జాన‌ప‌ద చిత్రం కావ‌డం, ప‌వ‌న్‌కు ప‌ల్లె జాన‌ప‌దాలంటే ఇష్టం వుండ‌టంతో ఆయ‌న‌తోనే ఓ పాట పాడించాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ఫిక్స‌య్యాడ‌ట‌. వెంట‌నే త‌న ఆలోచ‌న‌ను ప‌వ‌న్‌కు చెప్ప‌డం, ప‌వ‌న్ వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగిపోయాయని తెలిసింది.

ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం తాజ్ మ‌హ‌ల్‌, చార్మినార్, వాట‌ర్ ఫాల్స్ సెట్‌ని నిర్మించిన మేక‌ర్స్ తాజాగా ఓ ప‌డ‌వ సెట్‌ని కూడా నిర్మిస్తున్న‌ట్టు తెలిసింది.