క్రేజీ డైరెక్ట‌ర్‌ని నిల‌దీసిన అల్లు అర‌వింద్!

నిర్మాత అల్లు అర‌వింద్ చాణ‌క్యుడిలా ఎత్తుకు పైఎత్తులు వేయ‌డంలో దిట్ట అని ఇండ‌స్ట్రీలో టాక్‌. అదే `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాన్ని ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌బెట్టేలా చేసింది. ఎంచుకున్న వ‌ర్క్ విష‌యంలో స్ట్రిక్ట్‌గా వ్య‌వ‌హ‌రించే అల్లు అర‌వింద్ అది అనుకున్న విధంగా రాక‌పోతే అంతే సీరియ‌స్‌గా రియాక్ట్ అవుతుంటారు. అలా వున్నారు కాబ‌ట్టే ఇండ‌స్ట్రీలో ఎంత మంది హేమా హేమీలు వచ్చినా త‌న బ్రాండ్ నేమ్‌ని ఇప్ప‌టికీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు.

అయితే తాజాగా అల్లు అర‌వింద్ ఓ ద‌ర్శ‌కుడిని నిల‌దీసిన‌ట్టు తెలిసింది. డిజిట‌ల్ మాధ్య‌మాలైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, జీ5ల‌కు పోటీగా తెలుగులో ఓన్ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ని `ఆహా` పేరుతో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌చార క‌ర్త‌ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ. ఈ ఓటీటీ కోసం వ‌రుస‌గా క్రేజీ ద‌ర్శ‌కుల‌తో వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు చేయాల‌ని ప్లాన్ చేశారు. నందినిరెడ్డి స్క్రిప్ట్ స్క్రీనింగ్ కో ఆర్డినేట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోంది. దీంతో చాలా మంది యువ ద‌ర్శ‌కులు, అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్స్ వెబ్ సిరీస్ స్క్రిప్ట్‌ల‌తో వాలిపోయార‌ట‌. వీరితో పాటు వేణు ఊడుగుల కూడా వెబ్ సిరీస్ చేయ‌డానికి వ‌చ్చి అల్లు అర‌వింద్‌కు ఓ వెబ్ సిరీస్ చేస్తాన‌ని క‌మిట్ అయ్యాడ‌ని తెలిసింది.

వేణు ఊడుగుల `విరాట‌ప‌ర్వం` చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. సినిమాని ప‌క్క‌న పెట్టి వెబ్ సిరీస్ కోసం రావ‌డం ఏంటి? అనే అనుమానం రావ‌చ్చు. రానా తొలి షెడ్యూల్ స్టార్ కాగానే త‌న కిడ్నీ ఆప‌రేష‌న్ కోసం యుఎస్ వెళ్లిపోయాడు. సాయి ప‌ల్ల‌వితో కొంత షూటింగ్ పూర్తి చేసిన వేణు ఊడుగుల ఆ త‌రువాత రానా లేక‌పోవ‌డంతో ఆ స‌మ‌యాన్ని వృధా చేయ‌లేక `ఆహా` కోసం వెబ్ సిరీస్ చేస్తాన‌ని క‌మిట్ అయ్యాడ‌ట‌. స్క్రిప్ట్ పూర్త‌య్యేలోపు రానా తిరిగిరావ‌డంతో వెబ్ సిరీస్‌ని ప‌క్క‌న పెట్టి `విరాట‌ప‌ర్వం` పూర్తిచేసే ప‌నిలో ప‌డ్డాడు. ఇదే అల్లు అర‌వింద్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింద‌ట‌. చేతిలో సినిమా వున్న‌ప్పుడు వెబ్ సిరీస్ ఎందుకు ఒప్పుకున్నావ‌ని వేణు ఊడుగుల‌ని నిల‌దీసిన‌ట్టు తెలిసింది. దీనికి అత‌ని ఎలాంటి స‌మాధానం రాలేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.