ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడి రెండో సినిమా

అందరినీ ఆకట్టుకునే సినిమాలు తీస్తే దర్శకుడు కొత్త దర్శకుడైనా ప్రేక్షకులు  బాగా ఆదరిస్తారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు వెంకటేష్ మహా.

ఈ ఊపుతోనే మరో మంచి చిత్రం తీశాడు. ఆ రెండో చిత్రమే ‘ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’. ఈ చిత్రంలో  సత్యదేవ్ విలక్షణ పాత్రలో కనిపించబోతున్నాడు. శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని అర్కా మీడియా వ‌ర్క్స్ పతాకంపై.. మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై కేరాఫ్ కంచరపాలెం నటి, నిర్మాత అయిన విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి సంయుక్తంగా ‘ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన సూపర్ హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ మూవీ లాక్ డౌన్ టైంలో పూర్తయింది. కానీ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో విడుదలకు ఆటంకాలు ఎదుర్కొంటోంది. ఈమూవీ ఫస్ట్ లుక్, టీజర్‌తో ఆకట్టుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో విడుదలకు రెడీ అయ్యింది.  

చిత్ర నిర్మాతలు ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు.  ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో విడుదలకానుంది. తాజాగా  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను అందుకుంది.ఈ మూవీ విజయం పట్ల చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది. ఈ నెలాఖరుకి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నా.. జనాలు గుమిగూడి థియేటర్స్‌కి వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారానే విడుదల చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు నిర్మాతలు.