బామ్మార్ది కండ్లలో ఆనందం కోసం ఈ పోలీసు ఏం చేసిండంటే? (వీడియో)

అప్పట్లో ‘‘బావ కళ్లలో ఆనందం కోసమే రాయలసీమ టిడిపి ఫ్యాక్షన్ నేత పరిటాల రవిని కాల్చాను’’ అని నిందితుడు మొద్దు శీను ప్రకటించాడు. ఇక్కడ బావ ఎవరంటే మద్దెల చెరువు సూరి అలియాస్ సూర్యానారాయణరెడ్డి. కాల చక్రం తిరిగింది.. అనతికాలంలోనే బావ సూరిని తన అనుంగు అనుచరుడే భాను కిరణ్ అంతమొందించాడు. బావ అట్ల ఖతమైతే.. బామ్మార్ది మొద్దు శీను ను ఓంకార్ అనే వ్యక్తి హత్య చేసినట్లు అంగీకరించాడు. అదంతా రాయలసీమ రక్త చరిత్ర. ఇప్పుడు సీమలో ఫ్యాక్షన్ చల్లారిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణలో ఒక ఎస్సై తన బామ్మార్ది కండ్లలో ఆనందం కోసం ఒక సొసైటీ అధ్యక్షుడిని పట్టుకుని బెల్టు తీసుకుని యమ కొట్టుడు కొట్టిండు. రక్తం కారేటట్లు కొట్టడమే కాదు ఏకంగా తీస్కపోయి సెల్ లో పడేసిండు. ప్రజల రక్షణ కోసం ఒంటిమీద వేసుకున్న యూనిఫామ్ ను బామ్మార్దిని సంతోషపెట్టేందుకు వినియోగించిన ఈ పోలీసు తీరుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాధితుడు, బాధితుడి తాలూకు వ్యక్తులు తెలిపిన పూర్తి వివరాలు కింద చదవండి. కింద వీడియో ఉంది. ఆ వీడియోలో బాధితుడు ఏం చెబుతున్నాడో చూడండి.

 

ఆవుల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం, ఇడికుడ గ్రామపంచాయతీకి గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యక్షుడు. ఆయన ఆదివారం పని మీద చండూరు పోయిండు. చండూరు పోలీసు స్టేషన్ సమీపం నుంచి పోతున్న క్రమంలో స్థానిక ఎస్సై సైదులు, ఆయన బామ్మార్ది నాగరత్నం రాజు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఎస్సై బామ్మార్ది నాగరత్నం రాజు ప్రస్తుతం నల్లగొండలో కౌన్సిలర్. నాగరత్నం రాజుకు ఆవుల శ్రీనివాస్ కు మధ్య పాతకాలం నుంచే స్నేహంతోపాటు వైరం కొద్దిగా ఉంది. అయితే ఎస్సై, నాగరత్నం రాజును కలిసిన శ్రీనివాస్ యాదవ్ వారిద్దరికీ నమస్తే పెట్టి కొద్దిసేపు ముచ్చటించాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఆవుల శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచి వెళ్లిపోయిండు.

ఆ దారిలో కొద్ది దూరం పోయిన తర్వాత మూత్రం చేసేందుకు బైక్ ఆపిండు. ఈ చిన్న గ్యాప్ లోనే తనకు  ఆవుల శ్రీనివాస్ కు మధ్య ఉన్న పాత వైరాన్ని ఎస్సైకి వివరించాడు నాగరత్నం రాజు. దీంతో కోపంతో రగిలిపోయిన ఎస్సై వెంటనే బండి తీసి వేగంగా ఆవుల శ్రీనివాస్ బండిదగ్గరికి పోయిండు. అంతేకాదు ‘‘ఏం రా నువ్వు పెద్ద రౌడీవటగా.. అంత బలుపారా నీకు.. నీ సంతగి చూస్త బిడ్డా’’ అంటూ కొట్టడం షురూ చేసిండు. ‘‘ఇప్పటిదాంక మంచిగ మాట్లాడుకుంటిమి ఇప్పుడెందుకు కొడ్తున్నవ్ సార్’’ అని ఆవుల శ్రీను షాక్ అయిండు. కొట్టొద్దని కాళ్లా వేళ్లా పడుతున్నడు. అయినా వినకుండా ఆ ఎస్సై సైదులు బెల్టు తీసి మరీ కొట్టిండు. తర్వాత తీసుకుపోయి సెల్ లో పడేసిండు.

ఈ హటాత్ పరిణామం చండూరు మండలంలోనే కాకుండా నల్లగొండ జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. గొర్రెల ఫెడరేషన్ ఛైర్మన్ ను అకారణంగా కొడతారా అని యాదవ సంఘం నేతలు చండూరులో మరుసటిరోజు ధర్నాలు, ర్యాలీలు జరిపారు. తక్షణమే ఎస్సైని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బామ్మార్ది మాటలు నమ్మి అకారణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జిల్లా ఎస్పీని కలిసి ఎస్సై మీద చర్యలు తీసుకోవాలని కోరే పనిలో ఉన్నారు యాదవ సంఘం నేతలు.

గతంలో బిజెవైఎం లీడర్ ను కొట్టిండు

ఈ ఎస్సై సైదులు తొలినుంచీ వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పుల్లెంల అనే గ్రామంలో బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి నరేందర్ రెడ్డి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దగా వివాదమేమీ జరగలేదు. అయినా అకారణంగా బిజెవైఎం నేత నరేందర్ రెడ్డిని పట్టుకొని కొట్టినట్లు చండూరు గ్రామానికి చెందిన బిజెపి నేత ఒకరు చెప్పారు. తెలంగాణ పోలీసు బాస్ డిజిపి మాత్రం రిక్షా కార్మికుడు స్టేషన్ కు వచ్చినా సార్ అని పిలవాల్సిందే అని పోలీసులకు ఆదేశాలిస్తుంటే సైదులు మాత్రం స్టేషన్ కు ఎవరైనా వస్తే దురుసుగా ప్రవర్తిస్తుంటాడని జనాలు బాధపడుతూ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఎస్సై పై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ కేసు కాంప్రమైజ్ చేసేందుకు కొందరు నల్లగొండకు చెందిన రాజకీయ నేతలు రంగంలోకి ఇప్పటికే దిగినట్లు సమాచారం అందుతోంది.

నేను వికలాంగుడిని అయినా కొట్టిండు : శ్రీనివాస్ యాదవ్

ఎస్సై దాడిపై ఆవుల శ్రీనివాస్ యాదవ్ తెలుగురాజ్యంతో మాట్లాడారు. ‘‘మే 28, 2015న నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కుడి కాలు విరిగింది. ఇంకా ఆ కాలు సరిగా అతకలేదు. నేను బండి కూడా సరిగా నడపలేను. అందరిలాగ నేను నడవలేను. నాకు సదరన్ సర్టిఫికెట్ ఉంది. ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా నాకొస్తది. చండూరు పోలీస్ స్టేషన్ కాడ.. ఎస్సై వచ్చి నన్ను గొడ్డును బాదినట్లు బాదిండు. నీకు దండం పెడతా సార్ అంటున్నా వినిపించుకోలేదు. నేను  హ్యాండిక్యాపుడ్ మనిషిని అని చెప్తున్నా వదలకుండా కొట్టిండు.’’ అని వెల్లడించారు.  

నల్లగొండ ఎస్పీ సీరియస్ : 
ఈ ఘటనపై యాదవ సంఘం నల్లగొండ జిల్లా నేతలు మంగళవారం జిల్లా ఎస్పీ వెంకట రంగనాథ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సై అకారణంగా బామ్మార్ది ఆనందం కోసం ఆవుల శ్రీనివాస్ యాదవ్ పై దాడిచేశాడని ఎస్పీకి వివరించారు. జరిగిన ఘటనపై ఇప్పటికే తమకు సమాచారం అందిందని ఎస్పీ వారికి తెలిపారు. సిసి పుటేజీ పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి సమాచారం రాగానే ఎస్సై సైదులుపై చర్యలు తీసుకుంటామని వారికి చెప్పినట్లు యాదవ సంఘం నేతలు తెలిపారు.