తెలంగాణలో డిసెంబర్ 11 న జరిగే ఎలక్షన్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు, రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి తొలివిడత శిక్షణ పూర్తి అయిందని, 10న రెండవ విడత శిక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. సిబ్బంది మొబైల్ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరు. పార్టీల ఏజంట్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ టీవీ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, భారత ఎన్నికల సంఘం అధికారులు పర్యవేక్షిస్తారు. ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ స్థాయిలో పోలీసులను మోహరించనున్నారు. తగాదాలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
