సూర్యకిరణాలు పడతాయని చెప్పి గోపలాయపల్లిలో జనాలను మోసం చేసిన స్వామీజీ

ఆధునిక కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా జనాలలో మూఢ నమ్మకాల పిచ్చి అయితే పోవడం లేదు. ఏకంగా ఓ స్వామిజి ఇచ్చిన పిలుపుతో కొన్ని వేల మంది జనాలు అక్కడకు తరలిరావడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ కు చెందిన లక్ష్మీకాంత శర్మకి స్వామిజిగా పేరుంది. ఆయన ఓ ఛానల్ లో ప్రవచనాలు కూడా చెబుతాడు. మార్చి 6 వ తేదిన అమావాస్యనాడు గోపలాయపల్లిలో ఉన్న వేణుగోపాల స్వామి పై సూర్య కిరణాలు పడుతాయని, ఇది చూస్తే అంతా శుభమే కలుగుతుందని పిలుపునిచ్చాడు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలోని గుట్ట పై ఈ గుడి ఉంది. అదే రోజున తాను అక్కడ యాగం చేస్తానని ప్రకటించాడు. 

లక్ష్మీకాంత శర్మ

 దీంతో ఇది నిజమని నమ్మిన ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలి వచ్చారు. వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ఇంతకీ అక్కడ నిజంగా సూర్య కిరణాలే పడలేదు. ఇది 89 సంవత్సరాలకొకసారి వస్తుందని నమ్మించాడు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు అధికంగా రావడంతో రోడ్ల దగ్గర ఫుల్ ట్రాఫిక్ జాం అయ్యింది. టోల్ గేట్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి.

దీంతో ఎస్పీ రంగనాథ్ విషయం తెలుఃసుకొని రంగంలోకి దిగగా అసలు విషయం బయటపడింది. నార్కట్ పల్లి, గోపలాయపల్లి ఏరియాలో కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు. దీంతో తొందరగా డెవలప్ కావాలంటే ఈ విధంగా చేస్తే గిరాకి రావడంతో పాటు ఫేమస్ అయిపోతామని ప్లాన్ వేసి స్వామిజిని సంప్రదించినట్టు తెలుస్తోంది. స్వామిజి ఈ విషయాన్ని  ఓ చానల్ ప్రోగ్రాంలో ప్రకటించారు. ఆ దిశలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాల్ డేటా ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై కేసు నమోదు చేశారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రకటనలు చూసి మోసం పోవద్దు అని ఎస్పీ రంగనాథ్ కోరారు. ప్రజలంతా క్షేమంగా తమ స్థలాలకు వెళ్లి పోవాలని కోరారు. స్వామిజి పై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామన్నారు. 

జనాలకు కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకకపోవడంతో అల్లాడిపోయారు. మొత్తానికి స్వామిజి ప్రజలను భలే మోసం చేశాడని అక్కడికి పోయిన వారిని చూసి అంతా నవ్వుకుంటున్నారు. దేవుని మహిమ ఏమోగానీ స్వామిజి మరోసారి ఫేమస్ అయ్యాడు.