నాగర్ కర్నూల్ స్వాతి కేసు గుర్తుంది కదా… సరిగ్గా ఏడాది క్రితం భర్త సుధాకర్ రెడ్డిని ప్రియుడు రాజేష్ తో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. అంతే కాదు భర్త స్థానంలో తన ప్రియుడిని నిలిపేందుకు నానా తంటాలు పడి చివరకు జైలు పాలయ్యింది. ఇప్పుడు స్వాతి కేసు మరో మలుపు తిరిగింది.
నాగరుకర్నూల్ జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ ను తలపించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో అతని భార్య స్వాతికి బెయిల్ మంజూరైంది. కానీ జామీను ఇవ్వడానికి ఎవ్వరూ రాకపోవడంతో స్వాతి జైలులోనే ఉండిపోయింది. నాగరుకర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన స్వాతి, సుధాకర్ రెడ్డి దంపతులు. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. ఈ క్రమంలో స్వాతికి రాజేష్ అనే ఫిజియో థేరపిస్టుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు రాజేష్ తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి హత్య చేసింది. ఆ తర్వాత అతనిని గుట్టు చప్పుడు కాకుండా కాల్చివేశారు. ఇక ప్రియుడిని ఏకంగా ఇంట్లోనే పెట్టుకోవాలని ప్లాన్ చేసింది స్వాతి. అందుకు ఆడిన నాటకం సినిమా కథను నడిపించింది. రాజేషే తన భర్త అని నమ్మించడానికి సరికొత్త నాటకం ఆడింది.
రాజేష్ పై ప్రణాళిక ప్రకారం ఎక్కువ గాయాలు కాకుండా యాసిడ్ పోసింది స్వాతి. ఆ తర్వాత ముఖం కాలిపోయాక హైదరాబాద్ లోని డిఆర్ డిఎల్ అపోలో ఆస్పత్రిలో స్వాతి రాజేష్ ను చేర్పించింది. కుటుంబ సభ్యులను రాజేషే సుధాకర్ రెడ్డి అని నమ్మించే ప్రయత్నం చేసింది. సుధాకర్ రెడ్డి తల్లికి అనుమానాలు మొదలయిన ముఖం గుర్తు పట్టలేకుండా ఉండటంతో ఏమనలేకపోయింది. సుధాకర్ రెడ్డికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సుధాకర్ రెడ్డి తల్లి మటన్ సూప్ ను తీసుకొచ్చి రాజేష్ కు ఇచ్చింది. అప్పుడు రాజేష్ మటన్ సూప్ ను తీసుకోవడానికి నిరాకరించాడు. రాజేష్ బ్రాహ్మణుడు. దీంతో తన అనుమానం నిజం చేసుకున్న సుధాకర్ రెడ్డి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హాస్పిటల్ కు చేరుకొని తమదైన శైలిలో విచారించగా అసలు బండారం బయటపడింది. ఇరువురు కటకటాలపాలయ్యారు.
స్వాతి తండ్రి ఈ ఘటనతో తన కూతురు చనిపోయిందని గుండు చేయించుకున్నాడు. అత్తింటి వారు ఆగ్రహంగా ఉన్నారు. స్వాతికి నా అనే వారు లేకుండా అయ్యారు. స్వాతికి బెయిల్ మంజూరైన తనను తీసుకొని వెళ్లడానికి జామీను ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కుటుంబసభ్యులే పట్టించుకోనప్పుడు పక్కవారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో స్వాతి జైలుకే పరిమితమయ్యింది.

భర్త సుధాకర్ రెడ్డితో స్వాతి
