గ్రేటర్ పోరు ఎంతో ఉత్కంఠంగా సాగి , తాజాగా జరిగిన పోలింగ్ తో ముగిసింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ప్రచారం చివరి రోజు వరకు అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో ఊదరగొట్టినా కూడా గ్రేటర్ లో పోలింగ్ మాత్రం 50 శాతం కూడా దాటలేదు.
జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదయిందని ఎస్ఈసీ పార్థసారధి వెల్లడించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే గత ఎన్నికల కంటే ఈసారి కొంచెం ఎక్కువగానే పోలింగ్ జరిగినా కూడా కనీసం 50 శాతం పోలింగ్ కూడా కాకపోవడం గమనార్హం.
కాగా, ఓల్డ్ మలక్ పేట్ లో పోలింగ్ రద్దయిన విషయం తెలిసిందే. డిసెంబరు 3న ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అయితే , గ్రేటర్ లో పోలింగ్ శాతం తగ్గినా తమకే లాభం అని ఇటు టీఆర్ ఎస్, అటు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై కోపంగా ఉన్న ప్రజలు పోలింగ్లో పాల్గొన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇదే తమకు కలిసివచ్చే అంశమని అంటున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోలింగ్లో పాల్గొన్నారని, మెజార్టీ సీట్లు తమకే వస్తాయని టీఆర్ ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించారని చెబుతున్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వం పై అసహనం ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది అని , గెలుపు బీజేపీదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.