హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. రేపు అనగా శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుతో ఎవరి బలం ఏంటనేది బయటపడిపోతుంది, మేయర్ పదవి ఎవరిదో తెలిసిపోతుంది. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ కి , బీజేపీ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ రెండు పార్టీలో గ్రేటర్ ఎన్నికల కోసం భారీగా ప్రచారం నిర్వహించాయి. అందరూ ఎదురు చూస్తున్న ఫలితాల రోజు రానే వచ్చింది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్ పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, దీనిలో భాగంగా 4వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు నగరంలో ఆంక్షలు విధిస్తున్నామని పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. తాజా నిబంధనల ప్రకారం, రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడటం, ఊరేగింపులు చేయడం నిషిద్ధం. అలాగే ఎవరూ కూడా ఎటువంటి ఆయుధాలూ కలిగి ఉండ కూడదు. చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు ఏవి ఉన్నా అలాంటి వారందర్నీ శిక్షిస్తామని హేచ్చరించారు.

అలాగే ఊరేగింపులు, బృందాలుగా పోగవడం, సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా చేయకూడదు. టెంట్లు వేయడం, స్టేజీలు ఏర్పాటు చేయడంపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించారు. మైకుల ఏర్పాటు, పబ్లిక్ లౌడ్ స్పీకర్లు వాడటం తప్పు. రాళ్లు పట్టుకొని ఉన్నా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. రోడ్లపైనా, కూడళ్లలో స్పీచులు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడం, ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం నేరాలని పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోలీసులు, మిలిటరీ, పారామిలిటరీ, హోమ్ గార్డులు, ఎన్నికల సిబ్బందికి కొన్ని సడలింపులు ఇచ్చారు.
