తెలంగాణలో వైసీపీకే అభిమానులు లేరని, అలాంటప్పుడు షర్మిలకు ఎక్కడి నుంచి వస్తారని, రాయలసీమ ఫ్యాక్షన్ కుయుక్తులు ఇక్కడ చెల్లబోవంటూ గత వారం కామెంట్లు చేసిన మంత్రి గంగుల కమలాకర్… మంగళవారం నాటి ప్రెస్ మీట్ లో షర్మిల కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నదో కారణాలను వివరిస్తూ.. ఆమెను అడ్డుకోడానికి తెలంగాణ సమాజం ఏం చేయాలో గంగుల చెప్పటంతో తెరాస కార్యకర్తలలో అలజడి మొదలైంది. ఇప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల వస్తోందని… ఆ తర్వాత జగన్ కూడా వస్తారన్నారు. జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తారన్నారు.

తెలంగాణలో ఆంధ్రా నాయకులకు పెత్తనం వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు, కొట్లాటలు సృష్టించేందుకే ఆంధ్రా పార్టీలు తెలంగాణలో అడుగుపెడుతున్నాయని ఆయన మండిపడ్డారు. వారందర్ని అడ్డుకుని మనల్ని కాపాడే రక్షకుడు కెసిఆర్ మాత్రమే. అందుకే కేసీఆర్ను మనం కాపాడుకోవాలని.. లేకుంటే ఇబ్బందులు తప్పవని కార్యకర్తలను కోరారు.
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి, రాజన్న రాజ్యం తెస్తామంటూ వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. లోటస్ పాండ్ వేదికగా తెలంగాణ జిల్లాలకు చెందిన వైయస్ అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. లేటెస్ట్గా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల వైఎస్ఆర్ అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమయ్యారు.
వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలుగా మెలిగిన నాయకులు షర్మిల కొత్త రాజకీయ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. లోటస్పాండ్లోని నివాసంలో షర్మిలతో భేటీ అయ్యారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి. మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పినప్పటికీ.. పూర్తిగా రాజకీయ అంశాలే భేటీలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ అనుచరులుగా పేరొందిన నేతలకు షర్మిల తొలి ప్రాధాన్యం ఇస్తుండగా.. షర్మిల పార్టీలో రంగారెడ్డి ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లేనని అంటున్నారు.
