Tinmar Mallanna: కాంగ్రెస్ న్యూ ఇంచార్జ్ సడన్ షాక్.. తీన్మార్ మల్లన్నపై వేటు పడిందిగా..

తెలంగాణ కాంగ్రెస్‌లో పెరుగుతున్న వివాదాలకు కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ బలమైన సమాధానం ఇచ్చారు. పదవిలో రెండో రోజే, తన శైలిలో స్పష్టతను చూపిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయడం ఈ పరిణామాల్లో కీలకంగా మారింది. ఈ నిర్ణయంతో పార్టీ క్రమశిక్షణ అంశాన్ని మరింత గట్టిగా అమలు చేయాలని అర్థమవుతోంది.

తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా రెడ్డి సామాజిక వర్గంపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించే నేతగా ప్రచారం చేసుకుంటూనే, తన భాషపై నియంత్రణ లేకుండా వ్యవహరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో, మల్లన్నకు ఈ నెల 5న షోకాజ్ నోటీసులు పంపినప్పటికీ, వాటిని ఆయన పట్టించుకోలేదు. తనపై వచ్చిన అభియోగాలను లైట్ తీసుకోవడం, సమాధానం ఇవ్వకపోవడం, పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.

కాగా, కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం హైదరాబాద్ చేరుకొని, రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులపై సమీక్షలు నిర్వహించారు. ఇందులో మల్లన్న వ్యవహారం ప్రస్తావనకు రాగానే, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాను వచ్చిన కొన్ని గంటల్లోనే పార్టీ లైన్ దాటేవారికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

ఈ నిర్ణయంతో, తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణను కచ్చితంగా పాటించాలని సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. మల్లన్నపై తీసుకున్న చర్య పార్టీ నేతలకు స్పష్టమైన హెచ్చరిక అని అర్థం చేసుకోవాలి. ఇక నుంచి ఎవరైనా పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, అధిష్ఠానం తక్షణమే చర్యలు తీసుకుంటుందనే విషయం ఇప్పుడు బయటపడింది. మల్లన్న వ్యవహారం మరింతగా ఎటువైపు వెళ్తుందో చూడాలి.

తమన్నా, కాజల్ బుక్ || Cine Critic Dasari Vignan EXPOSED Tamanna & Kajal Crypto Currency Case || TR