తెలంగాణలో గడిచిన నాలుగేళ్లలో ప్రతిపక్ష పార్టీలకే అధికార టిఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వైసిపిని చాప చుట్టి టిఆర్ఎస్ లో కలుపుకుంది అలాగే టిడిపిని సైతం చావుదెబ్బ తీసింది. దాంతోపాటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ను సైతం టిఆర్ఎస్ చీల్చి చెండాడింది. ఆ పార్టీకి చెందిన పెద్ద పెద్ద లీడర్లను కూడా గుంజుకుని తమ పార్టీలో చేర్పించుకుంది. ఉన్న ఒక్క సిపిఐ ఎమ్మెల్యేను గుంజుకుంది. అంతెందుకు ఇటీవల జరుగుతున్న అవిశ్వాస పరీక్షల్లోనూ టిఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఇక మిగతా పార్టీల్లో బలమైన లీడర్లందరినీ పార్టీలో చేర్చుకుంది. ఇక తిరుగే లేదనుకున్న దశలో టిఆర్ఎస్ కు ఎన్నికల దగ్గరలో ఉన్నవేళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. ఆ వివరాలేంటో చదవండి.
పరకాల మున్సిపల్ ఛైర్మన్ పై టిఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు. 20 రోజుల క్రితం కలెక్టర్ హరిత కు టిఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు అందజేశారు. అప్పటి నుంచి క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎలాగైనా ఈ అవిశ్వాసం నెగ్గి ఇప్పుడున్న ఛైర్మన్, వైస్ ఛైర్ పర్సన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది. చివరకు అధికార పార్టీకి భంగపాటు తప్పలేదు. గురువారం అవిశ్వాసం వీగిపోవడంతో అధికార పార్టీ పంతం నెగ్గలేదు. దీంతో ఛైర్మన్ రాజభద్రయ్య పదవికి టిఆర్ఎస్ తెచ్చిన ముప్పు తప్పింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టిఆర్ఎస్ లో చేరి ఛైర్మన్ అయిన రాజభద్రయ్య.. తదనంతర కాలంలో తన పదవికి టిఆర్ఎస్ లో ఉంటే ముప్పు వస్తుందని తెలుసుకుని కాంగ్రెస్ లో చేరడం ద్వారా తిరిగి తన పదవి చేజారకుండా కాపాడుకుని రాజకీయ చాణక్యం ప్రదర్శించాడని పరకాలలో అంటున్నారు. నాలుగేళ్ల పరకాల ప్రస్తానం పై ఫుల్ స్టోరీ చదవండి.
పరకాల నగర పంచాయతీకి 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి 8 కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి 7, బిజెపికి 2, బిఎస్పీకి 1, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. అయితే హంగ్ రావడంతో ఇండిపెండెంట్ గా గెలిచిన రాజ భద్రయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి టిఆర్ఎస్ లో చేరి ఛైర్మన్ పదవి అందుకున్నారు. అప్పుడు ఆయనకు బిజెపి, బిఎస్పీ సభ్యులతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి కూడా మద్దతు ఇచ్చారు. అయితే గాడి సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో రాజ భద్రయ్య మీద టిఆర్ఎస్ కు ఆగ్రహం వచ్చింది. ఆయన పార్టీ మాట లెక్కచేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు అవినీతి పెరిగిపోయిందని విమర్శలొచ్చాయి. దీంతో ఎలాగైనా రాజభద్రయ్యను కుర్చీలోంచి దింపాలని టిఆర్ఎస్ భావించింది. అదును కోసం టిఆర్ఎస్ ఎదురుచూస్తున్న వేళ రాజభద్రయ్య మాంచి ప్లాన్ వేశారు. ఈ తతంగాన్ని కనిపెట్టిన రాజభద్రయ్య ఈనెల 5వ తేదీన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. ఈ పరిణామం టిఆర్ఎస్ కు పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో వెంటనే కలెక్టర్ కు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఇక అవిశ్వాసం గెలవాల్చిన బాధ్యత స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భుజాలపై పడింది. ఆయన కసరత్తు చేసి అవిశ్వాసాన్ని నెగ్గేందుకు కసరత్తు చేశారు. కానీ క్యాంపు రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్లు అందరనీ గుండుగుత్తగా హిమాచల్ ప్రదేశ్ కు క్యాంపుకు తరలించింది.
దీంతో అవిశ్వాస పరీక్ష గురువారం జరిగింది. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 14 మంది సభ్యుల బలం టిఆర్ఎస్ కు రావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ కౌన్సిలర్లు హిమాచల్ ప్రదేశ్ లో హల్ చల్ చేస్తున్నారు. దీంతో కౌన్సిలర్లు ఎవరూ అవిశ్వాస పరీక్షకు రాలేదు. ఉదయం 11 గంటలకు, తర్వాత 2 గంటలకు అవిశ్వాసం పరీక్ష నిర్వహించేందుకు ఎదురుచూశారు అధికారులు. ముందు ఛైర్మన్ పై అవిశ్వాసం జరిపి తర్వాత వైస్ ఛైర్మన్ దేవునూరి రమ్యకృష్ణ పై అవిశ్వాస పరీక్ష జరపాల్సి ఉంది. సమయం ముగిసే వరకు వేచి చూసిన అధికారులు అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటించారు. సరిపోయే సంఖ్య రాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. అయితే అవిశ్వాస పరీక్ష వాయిద పడుతుందని ప్రచారం జరిగినా.. అధికారులు మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. కథ ముగించేశారు. కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. టిఆర్ఎస్ నేతలు మాత్రం దిగాలుగా ఉన్నారు. మొత్తానికి ఈ పరిణామం టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఇరకాటంలోకి నెట్టిందని చెప్పవచ్చు.
