బిగ్ ట్విస్ట్: కవిత కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ!

ఢిల్లీ లిక్కర్ స్కాం లో రోజుకో రకంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో కవితలాంటివాళ్లు ఎవరితెలివి తేటలు వాళ్లు చూపిస్తుంటే… “ఈడీ తో అంత ఈజీ కాదు” అన్నట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వారి వ్యూహాలతో వారు ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా కవిత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.

రెండోసారి విచారణలో భాగంగా… 16వ తేదీన అనూహ్యరీతిలో కవిత గైర్హాజరవ్వడంతో.. ఈడీ ముందుజాగ్రత్త చర్యలకు ఉపక్రమించినట్లుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌ లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఈడీ ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది!

అయితే… ఈనెల 24న కవిత పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో కవిత తరపు న్యాయవాదితో పాటు ఈడీ తరుపు న్యాయవాదుల వాదనను కోర్టు విననుంది. ఈడీ తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా… దానికి కౌంటర్ గా ఈడీ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ ఇప్పటికే తోసిపుచ్చింది.

ఇదేక్రమంలో… విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు కవిత. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని ఈడీ అధికారులకు గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా, చట్టప్రకారం జరగడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు.

దీంతో… సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈడీ అధికారులు కూడా ఈ కోణంలోనే ఆలోచించి ఉంటారని.. అందుకే సుప్రీం కు వెళ్లారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపచేయాలని, అనంతరం అరుణ్‌ పిళ్లైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే… ఈసారి కూడా కవిత హాజరుకాని పక్షంలో ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది!