తెలుగు యూట్యూబ్ ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ప్రపంచ దేశాలు చుట్టేస్తూ, ప్రజలకు విభిన్నమైన అనుభవాలు అందిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ కంటెంట్ క్రియేటర్… తాజాగా తెలంగాణ సర్కార్ ఉన్నతాధికారులపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ను కేంద్రంగా చేసుకుని అన్వేష్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో రూ.300 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు చేశారు. డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సహా ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవ సమాచారంతో ప్రజలను దారితప్పించేలా ఉన్నాయని సైబర్ క్రైం శాఖ అభిప్రాయపడింది.
ఈ అంశంపై ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్వేష్ వీడియోలో ఉన్న సమాచారం ప్రభుత్వ పరిపాలనను, అధికారుల నైతికతను దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. పైగా ఇది ప్రజల్లో అపోహలు రేపే విధంగా ఉందని కూడా అభ్యంతరం వ్యక్తమైంది. దాంతో ప్రభుత్వ ప్రతిష్టను కించపరిచేలా ప్రయత్నించిన కేసుగా చూస్తూ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటివరకు అందరికి ప్రయాణాల సందేశాలు ఇచ్చిన అన్వేష్ ఇలా వివాదాస్పదమైన విషయాల్లోకి అడుగుపెట్టి తలకిందులయ్యాడన్న మాట వినిపిస్తోంది. అతని నమ్మకంతో చూసే యూట్యూబ్ ప్రేక్షకుల్లో కూడా ఈ ఆరోపణల వల్ల ఆశ్చర్యం నెలకొంది. అయితే అన్వేష్ దీనిపై ఎలా స్పందిస్తాడో, వీడియోపై తన పరిశీలనల ఆధారంగా ఏం సమాధానం ఇస్తాడో చూడాలి.