అమృత ప్రణయ్ ఘటన మరువక ముందే…కడపలో

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య మరువకముందే కడప జిల్లాకు చెందిన మరో ప్రేమ జంట వ్యవహారం విజయవాడలో కలకలం రేపుతోంది. ఈ ప్రేమ పెళ్లి నచ్చని యువతి తల్లిదండ్రులు ఆమె భర్తను హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇప్పటికే ప్రేమ పెళ్లి కారణంగా మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు గురి కావడం ఇరు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ని కూడా ఆమె తల్లిదండ్రులు హత్య చేస్తారేమో అన్న భయంతో మీడియా ముందుకు వచ్చారు ఆ ప్రేమ జంట. పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

కడప జిల్లాకి చెందిన దీప్తి రెడ్డి, విజయ్ జులై 26 న కడపలో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010 నుండి వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు దీంతో జులైలో పెద్దలకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కాగా తమ కుటుంబసభ్యుల నుండి ప్రాణహాని ఉందని వీరు భయపడుతున్నారు.

దీప్తిరెడ్డి బంధువులు పోలీసు శాఖలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వారి ద్వారానే ఈ దంపతులపై కుటుంబసభ్యులు బెదిరింపుకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. పెళ్ళైన నాటి నుండి కుటుంబాలకు దూరంగా కాపురం పెట్టారు ఈ జంట. అయితే వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడకు పోలీసులు వచ్చి తమకు ఆశ్రయం కల్పించిన వారిపై బెదిరింపులు చేస్తున్నారని వెల్లడించారు.

విజయ్ నుండి దీప్తిని విడదీసి కడప తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య నేపథ్యంలో… దీప్తి తల్లిదండ్రులు కూడా విజయ్ ని చంపేస్తారేమో అనే భయంతో వారు డీజీపీని కలవటానికి విజయవాడ వచ్చారు. కుదరకపోవడంతో మీడియాని ఆశ్రయించారు. ఈ విషయాలన్నీ మీడియా ముందు వెల్లడించారు ఆ నవ దమతులు. మీడియా ద్వారా డీజీపీని కలిసే అవకాశం వస్తుందని వారు భావిస్తున్నారు.