విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు.. ఫిర్యాదు చేయడంతో పరార్?

ఆడపిల్లలు ఇంటి నుండి అడుగు బయట పెట్టాలంటనే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రోడ్ల మీదనే కాకుండా స్కూల్, ఆఫీస్ అని తేడా లేకుండా ప్రతిచోట వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కొందరు వ్యక్తులు వారి కామ వాంఛలు తీర్చుకోవడానికి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కూడా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పకుండా ప్రేమ, పెళ్లి గురించి చెబుతూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు మీద విద్యార్థులు ఫిర్యాదు చేయటంతో ఆ ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు.

వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జడ్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పోతు రాజేందర్ అనే ఉపాధ్యాయుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని వారు ఆరోపించారు. విద్యార్థినులను తన ఒళ్లో కూర్చోబెట్టుకోవడం, ప్రేమ, ప్రేమ వివాహాల గురించి పిల్లలకు నేర్పిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా తన మొబైల్ ఫోన్లో బూతు వీడియో లాంటివి చూపిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయం గురించి గతంలో ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.

ఇక ఆ కీచక ఉపాధ్యాయుడు అరాచకాలు రోజురోజుకీ ఎక్కువ అవ్వటంతో విద్యా కమిటీ చైర్మన్ నరేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మండల విద్యాధికారి సమక్షంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలలో విచారణ చేపట్టగా ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు నిజమేనని వారు తెలిపారు. ఈ విషయం గురించి విద్యార్థినులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే సదరు ఉపాధ్యాయుడు రెండూ రోజులుగా పాఠశాలకు రావడం లేదని పరారీలో ఉన్నాడని గుర్తించాడు. గతంలో చౌటుపల్లి పాఠశాలలో పనిచేసినప్పుడు రాజేందర్‌పై ఇదే రకమైన ఫిర్యాదులు వచ్చాయని.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాజేందర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.