ధోని పనైపోయిందా.. క్లియర్‌గా ఔటైనా అప్పీల్‌ చేయలేదేంటి?

ipl 2020 ms dhoni clear mistake agains delhi capitals match

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని చేసిన తప్పిదం కారణంగా పృథ్వీ షాకు తొలి ఓవర్‌లోనే జీవనదానం లభించింది. ధోని పుణ్యమా అని డకౌట్‌ కావాల్సిన ఈ యువ క్రికెటర్‌ ఏకంగా 64 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ కోరడంలో ఫెయిల్‌ అయిన ధోని.. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్యాచ్‌ పట్టినా ఔట్‌ కోసం అప్పీల్‌ చేయలేదు. ధోని అప్పీలు చేయకపోవడం పట్ల అంపైర్లు, కామెంటెటేర్లు విస్తుపోయారు.
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు మంచి ఆరంభాన్నే అందించారు. అయితే దీపక్‌ చహర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని కవర్స్‌ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ అంచును తాకి నేరుగా వికెట్‌ కీపర్‌ ధోని చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తగిలిన శబ్దం క్లియర్‌గా వినిపించినా అటు ధోని గాని ఇటు బౌలర్‌ దీపక్‌ చహర్‌ గాని అప్పీల్‌ చేయలేదు. దీంతో అంపైర్‌ మౌనంగా ఉండిపోయాడు. అయితే బంతి బ్యాట్‌కు తాకినా ఎవరూ అప్పీల్‌ చేయకపోవడంతో తనకేం తెలవదన్నట్టు మౌనంగా క్రీజులో ఉండిపోయాడు.
ధోని తప్పిదం కారణంగా తొలి ఓవర్‌లోనై లైఫ్‌ దక్కించుకున్న పృథ్వీ ఆ తర్వాత బౌండరీలతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే అర్థసెంచరీ సాధించాడు. జట్టు స్కోర్‌ 103 పరుగుల వద్ద చావ్లా బౌలింగ్‌లో పృథ్వీని దోని స్టంపౌట్‌ చేశాడు. అయితే ధోని తప్పిదంపై ధోని హేటర్స్‌ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు పలు ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.