శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఎటు నుంచి ఎవరి ప్రత్యర్ధులొచ్చి దాడులు చేస్తారో తెలియని ఆందోళన స్థానిక వాసుల్లో నెలకొంది. దీంతో ఎవరికి వారు వ్యక్తిగత రక్షణకు సిద్దమై ఉన్నారు. దాడులు జరిగితే ప్రతి దాడులు చేసేలే ఇరు పార్టీల వర్గీయులు సిద్దంగా ఉన్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పందిగుంట వద్ద తాగునీరు బోరుబావి విషయంలో టీడీపీ-వైకాపా మధ్య చిన్నగా వివాదం మొదలైంది. తర్వాత ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవడంతో గొడవ ముదిరింది. అంతటితో ఆగని ఆ రెండు ముఠాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు.
రెండు ముఠాల మధ్య ఘర్షణ ముదరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘర్షణలో 25 మంది గాయపపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురిని శ్రీకాకుళంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ నేపథ్యంలో పందిగుట్ట గ్రామంలో పోలీసులు, ఉన్నత అధికారులు పికెటింగ్ ఏర్పాటు చేసారు. అయితే ఈ జిల్లాలో గొడవలు జరిగితే అవి పక్క మండలాల్లోనూ చెలరేగుతుంటాయి. ఇక్కడ పార్టీ ఘర్షణలు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. తేదాపా- వైకాపా కార్యకర్తలు మాటలు విసురుకోవడం…దాడులు చేసుకోవడం తరుచూ జరుగుతుంది.
పంచాయతీలు పోలీసు స్టేషన్ల వరకూ వెళ్లడం…అక్కడ రాజీ పడటం తో తాత్కలికంగా పరిష్కారం దొరుకుతుంది. అయితే ఇదే సమస్య మళ్లీ మళ్లీ ఉత్పన్నం అవుతుంది. అయితే ఇక్కడ స్థానికులు యువతలో సరైన అవగాహన లేకపోవడం, ఆధిపత్యం కోసం పాకులాడే క్రమంలో తగాదాలకు దిగుతున్నారని చెబుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో శ్రీకాకుళంలోని చాలా మండలాల్లో గొడవలు సహజంగా జరుగుతుంటాయని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొన్ని మండలాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు, స్థానిక నాయకులు వ్యూహాలు..ప్రతి వ్యూహాలు వేస్తున్నట్లు సమాచారం.
