వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంది మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు, అవతల 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. వైఎస్ జగన్ నెట్టుకు రాగలరా ? పైగా రాష్ట్రం అప్పుల్లో ఉంది.. ఆయనిచ్చిన హామీలు గంపెడున్నాయి. వాటిని నెరవేర్చాలంటే వేల కోట్లు కావాలి. ఎక్కడి నుండి తెస్తారు. జగన్ పార్టీనైతే నడపగలిగారు కానీ రాష్ట్రాన్ని నడపగలరా అంటూ అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ జగన్ తన ఏడాది పాలనతో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. కష్టమనుకున్న సంక్షేమ పథకాలను అమలుచేసి భేష్ అనిపించుకున్నారు. అలాగే ప్రతిపక్షాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఏమో అనుకున్నాం.. జగన్ కంచు అనిపించుకున్నారు. ఆయనే కాదు ఆయన ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉన్నారు.
ఎమ్మెల్యేలు అంటే ఏదో రెండు మూడుసార్లు గెలిచేసి, కాకలు తీరిన సీనియర్లు కాదు.. కొత్త ఎమ్మెల్యేలు. మొదటిసారి టికెట్ పొంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు. అంటే ఫీల్డుకి కొత్తవారన్నమాట. కానీ వారి శైలి చూస్తే మాత్రం అలా ఉండదు. ఎన్నాళ్ళ నుండో రాజకీయాలను అవపోసనపట్టిన వారిలా దూసుకుపోతున్నారు. వాళ్లే తాడికొండ ఎమ్మెల్యే డా. శ్రీదేవి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, పలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు. వీళ్ళంతా రాజకీయాలకు కొత్తే. పేరున్న రాజకీయ నాయకులను ఓడించి అందరి ద్రుష్టినీ ఆకర్షించారు.
వీరిని చూసిన వారంతా ఏదో జగన్ హవా మీద గెలిచేశారు. ప్రత్యర్థులను, పార్టీలోని రాజకీయాలను తట్టుకోవడం వీరి వల్లవుతుందా. పార్టీ దాక ఎందుకు.. సొంత నియోజకవర్గాల రాజకీయాల ముందు నిలబడగలరా, అభివృద్ది పథంలో నడవగలరా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వాళ్ళు మాత్రం చిచ్చరపిడుగుల్లా రేగిపోతున్నారు. మాటల్లో, చేతల్లో దూకుడు చూపిస్తూ ప్రత్యర్థులను బెదరగొట్టడమే కాదు సొంత పార్టీలో సైతం మెరుపులు మెరిపిస్తున్నారు. తమను తాము కాపాడుకోవడంలో భేష్ అనిపించుకుంటున్నారు. తక్కువ కాలంలోనే ఎవరికి వారు బలమైన క్యాడర్ నిర్మించుకున్నారు. వీరి వ్యవహారం చూసిన జగన్ సైతం కొత్తవాళ్లయినా గట్టివాళ్లే అని అనుకుంటున్నారట.