‘ అప్పటి పాపం ‘ జగన్ ని ఇంకా వెంటాడుతోంది .. బయటపడేది ఎన్నటికో .. !

YS Jagan Andhra Pradesh Chief Minister

పార్టీలు మారడం అనేది రాజకీయాల్లో చాలా సహజమైన అంశం. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల చర్యలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా చెడ్డ పేరు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ మాట తప్పదు మడమ తిప్పడు అనే వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు జగన్ మాట తప్పుతున్నాడు మడమ తిప్పుతున్నాడు.

మడమ తిప్పిన జగన్

గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు వ్యభిచారంతో సమానమని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లాంటి వైసీపీ చెంతకు చేరిన విషయం తెలిసిందే. గతంలో తాను చెప్పిన మాటనే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాటించడం లేదని టీడీపీ నాయకులతో పాటు వైసీపీ నాయకులు అంటున్నారు. జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వంశీ, గణేష్ లు అంటున్నారు కానీ జగన్ మాత్రం చెప్పడం లేదు.

సెంటిమెంట్ రిపీట్ అయితే!

చంద్రబాబు హయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో, అంతేమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో దక్కారు. ఈ లెక్కన, 2024 నాటికి అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అయితే వైసీపీ పరిస్థితి ఏంటి.? ఓ డజను ఎమ్మెల్యే సీట్లు అయినా వైసీపీకి వస్తాయా.? రావా.? అన్న చర్చ జరుగుతోందట వైసీపీలో. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయమే లేదని వైసీపీ నేతలు అతివిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ మారిపోవడానికి పెద్దగా సమయం అవసరం లేదు. జాతీయ స్థాయిలో క్రిమినల్‌ కేసులున్న రాజకీయ నాయకులపై ‘వేటు’ అనే చర్చ జరుగుతున్న దరిమిలా.. రాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయే అవకాశముందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.