వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కిందా మీదా పడుతుంటారు. అయినా ఒక్కోసారి జగన్ మీద చురకలు విసరడంలో విఫలమవుతుంటారు. కానీ చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నాయకులందరినీ టీజ్ చేయడానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కరు చాలు. ఆయన చేసే విమర్శలు, చురకలు చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతుంటాయి. విజయసాయి రెడ్డి బహిరంగంగా కంటే ట్విట్టర్ ద్వారానే ప్రత్యర్థులను ఎక్కువగా ఆడుకుంటుంటారు. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఆయన వేసే ప్రతి ట్వీట్ భలే హైలెట్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో వేరే స్థాయిలో హాల్ చల్ చేస్తుంటాయి. వైసీపీ అభిమానులు విజయసాయిరెడ్డి ట్వీట్లను తెగ ఎంజాయ్ చేస్తే చంద్రబాబుగారి అభిమానులు మాత్రం గిలగిల్లాడిపోతుంటారు.
ముఖ్యంగా నారా లోకేష్ విషయంలో విజయసాయి వేసే ట్వీట్ విమర్శలు విపరీతమైన ఫన్నీగా ఉంటాయి. ప్రధానంగా లోకేష్ అమాయకత్వాన్ని ఎలివేట్ చేస్తూ విజయసాయి ట్వీట్లు గుప్పిస్తుంటారు. లోకేష్ బాబుని మాలోకం అన్నా, పప్పు అంటూ సంభోదించినా, చినరాయుడు పెడరాయుడు అంటూ తండ్రీకొడుకులకు మారుపేర్లు పెట్టినా విజయసాయికే చెల్లింది. లోకేష్ జగన్ మీద ఏదైనా విమర్శ చేస్తూ అందులో లాజిక్ మిస్సయ్యారంటే ఆరోజు విజయసాయిరెడ్డి ట్వీట్లకు బలవక తప్పదు. ఒక్కోసారి లోకేష్ తెలుగు మాట్లాడేటప్పుడు తప్పులు మాట్లాడుతుంటారు. అప్పుడు నాన్నా.. చిట్టీ అంటూ సాయిరెడ్డి చెలరేగిపోతారు.
తాజాగా కూడ లోకేష్ వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, అందుకు ప్రభుత్వానిదే భాధ్యత, ఇలా వసూలు చేసి అదే డబ్బును ప్రజలకు పంచుతారా అంటూ మండిపడ్డారు. ఇందులో తప్పునే విజయసాయి పట్టేశారు. ‘లోకేశం..నేచురల్ గ్యాస్ కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా? నేచరుల్ గ్యాస్ వ్యాట్లో మార్పులు జరిగితే ఎల్పీజీ పై అని దుష్ప్రచారం చేయిస్తావా? అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా? ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్ళీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’ అంటూ గాలితీసేశారు. ఇలా విజయసాయిరెడ్డి ప్రత్యర్థుల మీద పండిస్తున్న కామెడీకి వైసీపీలో వైఎస్ జగన్ సహా నేతలంతా పడి పడి నవ్వుకుంటున్నారట.