Crime News: పెళ్లి చేసుకుంటామని నమ్మించి అత్యాచార ప్రయత్నం..ప్రతిఘటించడంతో హత్య!

Crime News: ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువత ప్రేమ పేరుతో మోసపోతున్నారు. కని పెంచిన వారిని మోసం చేసి ప్రేమించిన వారి కోసం ఇంటినుండి పారిపోతున్నారు. అమ్మాయిల బలహీనతలను అడ్డుపెట్టుకొని చాలామంది కేటుగాళ్ళు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసి లొంగదీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుండి పారిపోయిన యువతులు అతడి చేతిలో మోసపోయి ప్రాణాలు కోల్పోయింది.

వివరాలలోకి వెళితే..తెలంగాణ లోని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఘోరం జరిగింది.బాధితురాలు కృష్ణవేణి ఒక దివ్యాంగురాలు. ఆమె తల్లి మరణించడంతో తన తండ్రి రెండవ వివాహం చేసుకొని హైదరాబాదులో కూలి పనులు చేసుకుంటూ నివాసముంటున్నారు. ఈ క్రమంలో కృష్ణవేణి ఈ నెల 13వ తేదీన కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించారు. ఆమె ఆచూకీ తెలియక పోయేసరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

కృష్ణవేణి వెంకట్ రాముడితో కలిసి ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నిందితుడు చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. కృష్ణవేణి ప్రతిఘటించడంతో కోపం వచ్చిన వెంకటరాముడు ఆమె చీరకు నిప్పు అంటించాడు.శుక్రవారం సాయంత్రం మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్లపొదల్లో కృష్ణవేణి ఒంటికి నిప్పంటుకొని కేకలు వేయగా స్థానికులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై 108 వాహనంలో నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం మెహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణవేణి మరణించడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.