Crime News: పెళ్లి జరిగిన వారానికే అలిగి పుట్టింటికి వెళ్ళిన భార్య..మనస్తాపంతో భర్త ఆత్మహత్య..!

Crime News: ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరికి దాపరికాలు లేకుండా నమ్మకం లేకపోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల ఇటీవల ఒక యువకుడు పెళ్లి జరిగిన వారానికే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే.. భార్య భర్తల మధ్య దాపరికం వల్ల ఒక నిండు ప్రాణం గాలిలొ కలసి పోయింది.పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల గౌరయ్య (35) అనే యువకుడికి వారం కిందట భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లయింది. అయితే పెళ్లికి ముందు గౌరయ్య కుటుంబ సభ్యులు వారికి మూడు ఎకరాల పొలం ఉన్నట్టు చెప్పారు. కానీ గౌరయ్యకు గ్రామంలో మూడెకరాల భూమిలో ఒక ఎకరం భూమి నాగపూర్ – విజయవాడ ఎక్స్ప్రెస్ హై వే నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తీరణ కోసం పోయింది. ఈ విషయం గౌరయ్య తన భార్య దగ్గర దాచాడు.

తాజాగా ఈ విషయం గౌరయ్య భార్యకి తెలియటంతో భర్త తన దగ్గర ఈ విషయాన్ని దాచటంతో అతనిని నిలదీసి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పెళ్లి జరిగిన వారానికే భార్య అలిగి పుట్టింటికి వెళ్లి పోవటంతో గౌరయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం పొలంలో ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య భర్తల మధ్య వచ్చిన చిన్న మనస్పర్థల వల్ల గౌరయ్య ప్రాణం కోల్పోయాడు. గౌరయ్య మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.