బండ్ల గణేష్ మాత్రమేనా.? పూరికి ఇంకెవరూ సన్నిహితుల్లేరా.?

దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే, నిర్మాత బండ్ల గణేష్‌కి ఎంత అభిమానమో. ఇద్దరి మధ్యా బోల్డంత స్నేహం వుంది. పూరి జగన్నాథ్‌కి అప్పట్లో స్నేహపూర్వకంగా.0 బండ్ల గణేష్ ఇచ్చిన ‘ఖరీదైన గిఫ్ట్’ పెను సంచలనం. ఆ సంగతి పక్కన పెడితే, డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిస్తే.. ఆ విచారణకు పూరి హాజరైతే, సుదీర్ఘ విచారణ జరుగుతున్న సమయంలో అక్కడికి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు బండ్ల గణేష్. ఇంకేముంది.? బండ్ల గణేష్‌ని కూడా ఈడీ పిలిపించిందన్న ప్రచారం జరిగింది. ‘పూరి జగన్నాథ్ నాకు అత్యంత సన్నిహితుడు. సుదీర్ఘ విచారణ జరుగుతోంది కదా.. ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చాను. అంతకు మించి, ఈ డ్రగ్స్ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. వక్క పలుకులు కూడా వేసుకోని నాకు డ్రగ్స్ కేసుతో ఎలా సంబంధం వుంటుంది.?’ అంటూ బండ్ల చెప్పుకొచ్చాడు.

పూరి జగన్నాథ్‌కి తెలుగు సినీ పరిశ్రమలో చాలామందితో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగని, అందరూ ఈడీ విచారణ వ్యవహారాలు తెలుసుకోవడానికి, విచారణ జరుగుతున్న ప్రాంతానికి వస్తారా.? ఇదేమన్నా పెళ్ళా.? పేరంటమా.? తేడా వస్తే.. ఇంకేమన్నా వుందా.? బండ్ల గణేష్ అంటేనే ఒకింత ‘అతి’. తాను అభిమానించేవారికోసం బండ్ల గణేష్ ఇంకాస్త ‘అతి’ ప్రేమ, అభిమానం చూపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ మీద పొగడ్తలు కురిపించలంటే బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా. ‘దేవర’ అంటాడు పవన్ కళ్యాణ్‌ని బండ్ల గణేష్. అంటే, పవన్ కళ్యాణ్‌‌కి బండ్ల గణేష్ భక్తుడన్నమాట. అన్న మాట ఏంటి.? వున్నమాటే. ఆ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. ఇక, సుమారు 11 గంటల పాటు పూరి జగన్నాథ్, ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. అయితే, ఇంత సమయమూ ఆయన్ని విచారించలేదనీ, మూడు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే విచారించారనీ, మిగతా సమయమంతా ఆయన వేచి వుండాల్సి వచ్చిందనీ అంటున్నారు.