టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కుప్పకూలి విద్యార్థిని.. ఏమైందంటే?

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది ఎవరు అంచనా వేయలేరు. ఇలా ఎటువంటి కారణాలు లేకుండానే కొంతమంది క్షణాలలో మరణిస్తున్నారు. ఇటీవల తరగతి గదిలో టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ విద్యార్థి క్షణాలలో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా వింజమూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. పదమూడేళ్ల షేక్‌ సాజీదా అనే విద్యార్థిని ఇలా గుండెపోటుతో మృతి చెందటంతో కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు.

పోలిసులు తెలిపిన వివరాల మేరకు…సాజీదా అనే పదమూడేళ్ల బాలిక వింజమూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే బుధవారం పాఠశాలకు వెళ్ళిన సాజీదా తరగతిలో టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఫిట్స్ వచ్చయేమో అని భావించి సాజీదా చేతిలో తాళాలు పెట్టినప్పటికీ ఏటువంటి ప్రయోజనం లేదు. దీంతో మరొక ఉపాధ్యాయుడి సహాయంతో సాజీదాని ఆస్పత్రికి తరలించారు.

అయితే విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. గుండెపోటుతో విద్యార్ధిని మృతి చెంది ఉంటుందని డాక్టర్లు ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చారు. అయితే బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత బాలిక మృతికి అసలు కారణం చెప్తామని డాక్టర్లు వెల్లడించారు. అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అకస్మాత్తుా ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. విద్యార్థిని మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.