Balakrishna: ఒకానొక సమయంలో ఏమీ కాలేకపోయాను కనీసం రైటర్నైనా అవుదామనే ఆలోచనతో సరదాగా ఓ కథ రాశానని ఆర్టిస్ట్ నాగ మహేశ్ అన్నారు. అది ఫస్ట్ టైం తన కథ స్వాతి వార పత్రికలో వచ్చిందని ఆయన తెలిపారు. అది చూసి తానే ఆశ్చర్యపోయి, ఏంటీ నేను రైటర్నా? అని తనలో తానే రెచ్చిపోయి 14 పేజీల కథను రాశానని ఆయన చెప్పారు. అది బాగానే రీచ్ అయిందన్న ఆయన, ఇప్పుడు తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ లాంటి వాళ్లు ఒక కథ చదివి, నువ్వు ఎంత పెద్ద వ్యాపారం చేసినా గానీ, కథ మాత్రం వదిలిపెట్టకు అని తనకు కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఆయన గర్వంగా చెప్పారు. ఓ సారి భోజ్యేషు మాతా అనే కథ రాశానని, అది చదివిన ఎమ్మెస్ నారాయణ ఆనందబాష్పాలు వచ్చేంత రేంజ్లో ఫీలయ్యారని నాగ మహేశ్ అన్నారు. చనిపోయిన మా అమ్మను గుర్తు చేశావని ఆయన అన్నట్టు మహేశ్ తెలిపారు.
బాలకృష్ణ గారు తనతో చాలా సరదాగా ఉంటారన్న నాగ మహేశ్, మీరు మీరుగా ఉంటే పర్లేదు. కానీ ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం ఆయన ఊరుకోరని మహేశ్ తెలిపారు. ఆయన్ని మెప్పించాలనో, బిస్కెట్లు వేయాలనో చూస్తే మాత్రం ఫసక్ అని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆయన చాలా కూల్గా ఉంటారన్న నాగ మహేశ్, పెద్ద స్టార్ అని గానీ, పెద్ద నటుడు అని గానీ బాలయ్య గారిలో ఏమీ కనిపించవని, అందరితోనూ చాలా సరదాగా మాట్లాడతారని ఆయన స్పష్టం చేశారు. లంచ్ గానీ లేదా బ్రేక్ తర్వాత గానీ షూట్లోకి రాగానే భోజనం చేశారా అని ఆప్యాయంగా పలకరిస్తారని ఆయన చెప్పారు. అలా తనను కూడా ఓ సారి అడిగి, ఫుడ్ బాగుందా, టేస్టీగా ఉందా అని ఆరా తీసినట్టు ఆయన తెలిపారు. ఆయన అలా అడిగేసరికి నిజంగా బాలయ్య గారు సీరియస్గా అడుగుతున్నారేమోననుకొని బాగుంది సర్, కానీ కొంచెం ఆలస్యం అయిందని తాను అంటే, దానికి ఆయన సమాధానంగా బాగుంటది అని, హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటారు అనేటటువంటి ప్రశ్నలు కూడా వేశారని నాగ మహేశ్ చెప్పారు.
అయితే తాము కలిసి పని చేసింది అప్పటికీ 2,3 రోజులేనని ఆయన అన్నారు. తాను ఉండే ఏరియా పేరు కూడా తెలుసుకున్నారని, ఇంతకు ముందు ఏం చేసేవారు అనేటటువంటి మాటలు తనను అడిగారని ఆయన చెప్పారు. ఒక్క 2,3 రోజులకే బాలకృష్ణ గారు తనకు ఎంతో పరిచయం ఉన్నవారిలా మాట్లాడారని ఆయన కొనియాడారు. అలా మాట్లాడబట్టే అంత చనువు ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. మామూలుగా పెద్ద ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులను భయపెడతారని ఆయన చెప్పారు. కానీ బాలకృష్ణ గారు మాత్రం అందరితోనూ కలసిపోయి, సరదాగా మాట్లాడతారని ఆయన వివరించారు.
