Crime News: తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఎ దారుణ హత్య..

Crime News: ప్రస్తుతకాలంలో రోజురోజుకి హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. పాత కక్షలు, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది హత్యలు చేయటానికి ,ఆత్మహత్యలు చేసుకోవటానికి పాల్పడుతున్నారు. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య సంబంధాలను మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన సంఘటన కలకలం రేపుతోంది. తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏ దారుణహత్యకు గురయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా, కన్నేపల్లి గ్రామంలో దుర్గం బాబు అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గా పని చేస్తున్నాడు . ఈ క్రమంలో సోమవారం ఉదయం దుర్గం బాబు తహసీల్దార్ కార్యాలయంలో రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన స్థానికులు షాక్ కి గురయ్యారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు.తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ ఎలా రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. హత్యకు గురైన వీఆర్ఏ దుర్గం బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వీఆర్ఏ మరణించిన విషయం పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడం తో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తొందరలోనే తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.