100 శాతం అమ్మేస్తాం…రాత్రి నుంచి రోడ్లపైనే స్టీల్‌ప్లాంట్ కార్మికులు!

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం ప్రైవేటీకరిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు కార్మికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆందోళనను మరింత ఉద్ధృతం చేసిన కార్మికులు రాత్రి నుంచి రోడ్లపైనే నిరసన కొనసాగిస్తున్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం విధానాలను నిరసిస్తూ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించారు. తెల్లవారుజామున ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు. నేడు స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి పిలుపిచ్చారు.

Image

జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు పరిశ్రమ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కేంద్ర ప్రకటనతో ఉన్న ప్రతులను దహనం చేశారు. నేడు విశాఖలోని ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో… పార్టీలు కూడా తమ వంతుగా ప్రకటనలు చేస్తున్నాయి. ఎలాగైనా ప్రైవేటీకరణను అడ్డుకొని తీరతామని అంటున్నాయి. ఇదే అంశంపై తాజాగా ప్రభుత్వం నుంచి ఓ ఆసక్తికర ప్రకటన వచ్చింది. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు అన్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితులలో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

నిన్న లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నలకు మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని, వంద శాతం అమ్మేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రజలైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఉద్యమాలు కొత్తేమీ కాదు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందే ఉద్యమం ద్వారా. అప్పట్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భూములు ఇవ్వడం ద్వారా విశాఖకు దాన్ని తెప్పించుకున్నారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్రం అంటుంటే… ప్రజలు భగ్గుమంటున్నారు. తమ ప్రాణాలైనా పణంగా పెడతాం గానీ… ప్రైవేటీకరణ జరగనిచ్చేది లేదంటున్నారు. మొత్తంగా ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో అనే ఆందోళన ఉంది.