జగన్ సర్కార్ పై నిమ్మగడ్డ వదిలిన ఆఖరి అస్త్రం ఇదే..!

nimmagadda vs jagan

 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి గురించి అందరికి తెలుసు, జగన్ తో ఢీ అంటే ఢీ అన్నట్లు నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉంటుంది. తాజాగా నిమ్మగడ్డ తీసుకున్న ఒక నిర్ణయం చూస్తే అధికార పార్టీ పట్ల ఆయన వ్యవహారశైలి ఏమిటో తెలుస్తుంది.తెలుస్తుంది కొందరు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

nimmagadda vs jagan

 తాను పదవి నుండి దిగిపోయే లోపు అన్ని స్థానిక ఎన్నికలు పూర్తిచేయాలనే ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయితీ ఎన్నికలు చివరి దశకు వచ్చింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు కూడా రీషెడ్యూల్ ప్ర‌క‌టించారు. ఇక మిగిలింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు మాత్ర‌మే. మున్సిపల్ ఎన్నికలను కూడా గతంలో ఎక్కడ అయితే ఆగిపోయాయో అక్కడ నుండే మొదలుపెడుతున్నారు.

 అదే కోవలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రారంభించాలని అధికార వైసీపీ పార్టీ నిమ్మగడ్డను విన్నవించింది. ఈ మేరకు ఎస్ఈసీతో సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ చ‌ర్చించారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిల‌ను ఆగిన చోటు నుంచే నిర్వ‌హించేందుకు నిమ్మ‌గ‌డ్డ సుముఖంగా లేరు. మ‌రోవైపు గతంలో జ‌రిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏక‌గ్రీవాల‌ను ర‌ద్దు చేయాల‌ని, కొత్త నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్షాలు గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏక‌గ్రీవాల‌ను రద్దుచేస్తే ఏక‌గ్రీవ‌మైన‌ట్టు డిక్ల‌రేష‌న్ ఫారాలు అందుకున్న వారు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తే, అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే ఉద్దేశంతో నిమ్మగడ్డ ఆఖరి అస్త్రంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌లోభాలు, బెదిరింపుల కార‌ణంగా నామినేష‌న్లు వేయలేద‌నే ఎవ‌రైనా భావించి, అందుకు త‌గ్గ ఆధారాలు త‌మ ద‌గ్గ‌ర ఉంటే వాటిని క‌లెక్ట‌ర్‌కు స‌మ‌ర్పించాలంటూ తాజాగా ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అలాంటి వాటిని క‌లెక్ట‌ర్ ప‌రిశీలించి త‌న‌కు ఈ నెల 20లోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఎస్ఈసీ ఆదేశించారు.

 గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఆ ప్రకటనతో పేర్కొంది. అలాంటి అభ్య‌ర్థుల‌కు తిరిగి నామినేష‌న్లు వేయ‌డానికి మ‌రో అవ‌కాశాన్ని క‌ల్పిస్తామ‌ని ఎస్ఈసీ స్ప‌ష్టం చేసింది. అయితే నిమ్మ‌గ‌డ్డ కోరుకుంటున్న‌ట్టు క‌లెక్ట‌ర్ల నుంచి నివేదిక‌లు వెళ్తాయ‌నేదే కేవ‌లం భ్ర‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.