Jayam Movie: జయం సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయమని అడిగితే ఏమన్నారంటే…?

Jayam Movie: ఈవీవీ గారు ఎందుకంత సీరియస్‌గా ఉంటారంటే, ఈ పని ఈ టైంకి అయిపోవాలి అంటే అయిపోవాలన్నట్టుగా ఆయన పని చేస్తారని, అంత స్పీడ్ ఉన్న డైరెక్టర్‌ను తాను ఇంతవరకూ చూల్లేదని డైరెక్టర్ వీరభద్రం అన్నారు. మళ్లీ ఆ స్పీడ్ కాకపోయినా అంత కమాండ్ ఉన్న డైరెక్టర్ మా తేజ గారు అని ఆయన గర్వంగా చెప్పారు. అప్పట్లో మానిటర్లు కూడా లేవని అలాంటి సమయంలోనే ఆయన ఎన్నో మంచి సినిమాలు చేశారని ఆయన అన్నారు. తాను ఎప్పటినుంచో జగపతిబాబు గారితో సినిమా చేయాలనుందని ఆయన చెప్పారు. కానీ 2,3 సార్లు అవకాశం మిస్సయిందని ఆయన తెలిపారు. ఇప్పుడు తీయబోయే సినిమాలోనైనా ఆయన్ని పెట్టాలనుకుంటున్నానని, అందుకోసం ఆయన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నానని వీరభద్రం అన్నారు. తాను చెయ్యాలనుకున్న హీరోలు ఇద్దరు అని, వారు ఎవరంటే రాజశేఖర్, జగపతిబాబు అని ఆయన స్పష్టం చేశారు.

జయం సినిమాకు కో డైరెక్టర్‌గా చేసిన తాను ఆ మూవీలో విలన్‌గా ఒకర్ని అనుకొని చివరికి గోపిచంద్‌గారిని పెట్టారని చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న తేజ గారు ఒకటి అనుకున్నారు కానీ ఎదుటి వ్యక్తి నుంచి అది రాకపోయే సరికి ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే అప్పటికే చాలా పాపులర్ అయిన విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లున్నారు. కానీ ప్రత్యేకించి గోపిచంద్‌నే ఆ సినిమాకు విలన్‌గా ఎంపిక చేయడానికి గల కారణాలను ఆయన ఈ విధంగా చెప్పారు. నిజం చెప్పాలంటే పెద్ద విలన్‌ను పెట్టాలి, చేయాలనే ఇంట్రస్ట్ తేజ గారికి ఉండదని, ఆయన ఎక్కువగా అప్ కమింగ్‌ యాక్టర్స్‌ను చూస్తారని ఆయన అన్నారు. అయితే గోపిచంద్ అప్పటికే తొలివలపు సినిమా చేశాడు. ఆ మూవీ చూసి ఆ సినిమాలో గోపిచంద్ బాగా చేశారని చెప్పానని ఆయన చెప్పారు. అనుకున్నట్టుగానే తేజ గారు ఆఫర్ ఇవ్వగానే ఆయన వెంటనే విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. అప్పటికే హీరోగా చేసినా కూడా తేజ గారి క్రేజ్ చూసి, ఆయన డైరెక్షన్‌లో చేస్తే చాలని గోపిచంద్ అనుకొని ఆ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారని వీరభద్రం వివరించారు.