టాలీవుడ్ ప్రముఖ నిర్మాత , స్టార్ హీరో తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య తనయుడిగా అప్పట్లో కొన్ని సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారు. ఇటీవల ” పక్కా కమర్షియల్ ” సినిమా ప్రెస్మీట్లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించగా.. గోపీచంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి.
ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఓటీటీల్లో సినిమా చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావాలంటే సినిమా హీరో హీరోయిన్లు తప్పకుండా ప్రచారంలో పాల్గొనాలని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. నిర్మాతలని చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి రారు. అందువల్ల హీరో, హీరోయిన్లు తమ సినిమాని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కోసం ఒక స్టార్ హీరో స్టేజ్ మీద డాన్స్ చేసిన విషయం కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
పక్కా కమర్షియల్ సినిమా ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్ తో పాటు హీరోయిన్ రాశిఖన్నా , డైరెక్టర్ మారుతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ..” లౌక్యం, రణం సినిమాల తరువాత ఆ తరహాలో నేను నటించిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమా మొత్తం నవ్వుతూనే షూటింగ్ పూర్తి చేసాము. డైరెక్టర్ మారుతి ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. టైటిల్ అలాగే ఈ సినిమా కూడా పక్కా కమర్షియల్ గా ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చాడు. లవ్ అండ్ యాక్షన్ తరహాలో సాగిపోయే ఈ సినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
