ఆస్తి రాసివ్వలేదని తల్లిని హత్య చేసిన కొడుకు..! ఎంత దారుణంగా అంటే..

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చాడు ఓ కన్నకొడుకుఆస్తి రాసివ్వలేదని రాడ్డుతో కొట్టి.. సిగరెట్ తో కాల్చి హింసించాడు. దారుణంగా ఆమెను నానా హింసలు పెట్టి కొట్టి హత్య చేశాడు. అత్యంత అమానవీయమైన ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బనగానపల్లె మండలంలోని మిట్టపల్లె గ్రామంలో నారపురెడ్డి రామచంద్రారెడ్డి భార్య పుల్లమ్మ కుమారుడు ప్రసాద్ రెడ్డితో కలిసి నివసిస్తోంది. పుల్లమ్మ పేరు మీద రెండు ఎకరాల పొలం ఉంది. ఆ ఆస్తిని తన పేరు మీద రాయాలని ఎప్పటినుంచో తల్లిపై ఒత్తిడి తెస్తున్నాడు ప్రసాదరెడ్డి. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఆమె ఆ రెండెకరాల పొలాన్ని కుమార్తె పేరు మీద రాసింది. దీంతో ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రసాదరెడ్డి నిత్యం తల్లి పుల్లమ్మను కర్రలతో కొడుతూ హింసలు పెడుతున్నాడు. ఆస్తిని తన పేరు మీదకు తిరిగి రాయాలని ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. వీరి గొడవకు చుట్టుపక్కల వారు పంచాయితీ చేయాలని చూసినా ప్రసాదరెడ్డి వారి మీద కూడా తిరగబడి ఇది తమ గొడవ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఘర్షణకు దిగేవాడు. దీంతో ఈ బుధవారం మధ్యాహ్నం ప్రాంతంలో ప్రసాదరెడ్డి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ ఆస్తి తన పేరు మీద రాయాలంటూ పుల్లమ్మను కొట్టాడు. ఇంట్లో ఉన్న కర్రలు, చేతికి అందిన సామానుతో తల్లిని చితకబాదాడు. సిగరెట్లతో ఆమెను కాల్చి వాతలు పెట్టాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక పుల్లమ్మ ప్రాణాలు విడిచింది.

 

దీంతో భయానికి గురై తలుపుకు గడియపెట్టి అత్తారింటికి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం ఎంతకీ పుల్లమ్మ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవారు వెళ్లి చూడగా పుల్లమ్మ అచేతనంగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏమీ ఎరుగనట్టు ఇంటికి వచ్చిన ప్రసాదరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.