చార్‌ధామ్ యాత్రలో సమంత: కల నెరవేరిందట

నాగ చైతన్యతో వివాహ బంధం రద్దు చేసుకున్న సమంత, పాపం ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చార్‌ధామ్ యాత్రను ఎంచుకుంది. హిమాలయాలు చూడాలన్నది తన జీవిత కల.. అని అది ఇన్నాళ్లకు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందనీ ఆమె చెప్పుకొచ్చింది.

తాజాగా చార్‌ధామ్ యాత్రలో భాగంగా, గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాధ్, బద్రీనాధ్ పుణ్య క్షేత్రాల దర్శనం చేసుకుంది సమంత. ఆ టూర్ విశేషాలను పంచుకుంటూ, ఇన్‌స్టాలో ఫోటోలు కూడా షేర్ చేసుకుంది. మహాభారతం చదివినప్పటి నుంచీ హిమాలయాల గురించి ఆకర్షితురాలినయ్యాననీ, హిమాలయాలు దేవతల నివాసం. ఎన్నో రహస్యాలకు నిలయం. భూలోక స్వర్గం.. అంటూ హిమాలయాల గొప్పతనాన్ని వర్ణించింది.

ఎప్పటికైనా హిమాలయాలు చూడాలన్న తన కల నేటితో నెరవేరిందనీ సమంత తన ఇన్‌స్టాలో పేర్కొంది. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి సమంత ఈ ఛార్‌ధామ్ యాత్రను పూర్తి చేసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది.

ఇక ఆమె ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, తెలుగులో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. దీంతో పాటు, బాలీవుడ్లో రెండు సినిమాలు, కోలీవుడ్‌లో ఓ సినిమాతో పాటు, మరిన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.