కేజీఎఫ్‌ను బంగారు గ‌నులలో సెట్ చేసిన ప్ర‌శాంత్ నీల్‌, స‌లార్ ఎక్క‌డ షూట్ చేస్తున్నాడో తెలుసా?

కేజీఎఫ్ చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. యష్ హీరోగా కేజీఎఫ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించి క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు సౌత్ సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని కూడా పెంచాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన కేజీఎఫ్ చిత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌తో పాటు ప‌లువురు న‌టీనటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

అయితే కేజీఎఫ్ త‌ర్వాత ప్రశాంత్ నీల్- హోంబలే ఫిలింస్ సంయుక్తంగా స‌లార్ అనే మూవీని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ సినిమా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఆ కార్య‌క్ర‌మానికి య‌ష్ కూడా హాజ‌ర‌య్యారు. ఫిబ్ర‌వ‌రి నుండి మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కేజీఎఫ్ చిత్రాన్ని బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ప్రశాంత్ నీల్ స‌లార్ మూవీని బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో చిత్రీక‌రించ‌నున్న‌ట్టు టాక్.

రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ఓ ప‌ది రోజుల పాటు చిత్ర షూటింగ్ జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‌ పనులు ప్రారంభించారు. సెట్టింగ్ ప‌నులు పూర్తి కాగానే చిత్ర బృందం అక్క‌డ వాల‌నుంది. ఓ ఫైటింగ్‌ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం . హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు కేజీఎఫ్‌ హీరో యశ్‌ కూడా నటిస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు.