అవును.. ఇప్పుడు టాలీవుడ్ లో అందరినోటా ఇదే మాట జోరుగా వినిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపు దిద్దుకోనున్న ఓ చిత్రంలో సాయిపల్లవి కీలకమైన క్యారెక్టర్ పోషించే అదృష్టాన్ని దక్కించుకుందని ఫిలింనగర్ అంతా కోడైకూస్తోంది.

‘ తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఈజ్ బ్యాక్ ఇన్ ఏ హై ఓల్టేజ్ రోల్’ అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ న్యూ మూవీ గురించి సితార ఎంటర్ టైన్ మెంట్ అభిమానులతో ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ‘అయ్యప్పన్ కోషియమ్’ అనే చిత్రం మలయాళంలో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి రీమేక్ గా పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుందని తెలుస్తోంది.
కాగా, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన క్యారెక్టర్ ను తెలుగులో హీరో నితిన్ పోషిస్తాడని తెలుస్తోంది. అయితే ఇదే పాత్రను రానా పోషించనున్నట్టు ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు తాజాగా ఆ పాత్రకు నితిన్ పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, తెరపైకి కొత్తగా సాయిపల్లవి పేరు సైతం విశేషంగా చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి సాయిపల్లవిని చిత్ర బృందం సంప్రదించిందట. అందుకు సాయిపల్లవి ఓకే చెప్పడంతో యూనిట్ అభినందనలు కూడా తెలిపిందట. అంతే కాకుండా ఈ చిత్రానికి ‘బిల్లా రంగా’ అనే పేరు కూడా జోరుగా ప్రాచుర్యంలో ఉంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెం -2 గా నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్. థమన్ సమకూర్చనుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దడానికి సకల సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ చిత్రంలో సాయిపల్లవి పాత్రకు గొప్ప ఇంపార్టెన్సు ఉందని, అందుకే సాయిపల్లవి ఈ పాత్రను పోషించేందుకు వెంటనే ఒప్పేసుకుందని చెప్పుకుంటున్నారు సినీ జనాలు. దటీజ్.. సాయిపల్లవి.. పవన్ కళ్యాణ్ సినిమాలో వేషం అంటే. మాటలా మరి. లక్ అంటే సాయిపల్లవిదే!
