సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు అన్నీ హస్తినలోనే తీసుకుంటారని.. హస్తిన కేంద్రంగా ఉన్న పెద్దలే నిర్ణయిస్తారని చెబుతుంటారు. అఫ్ కోర్స్… దాదాపు జాతీయ స్థాయి పార్టీలన్నింటిలోనూ అదే నడుస్తుందనుకోండి!
తెలుగు రాజకీయాల్లో “అధిష్టాణం” అనే పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెబుతుంటారు. ఈ సమయంలో… టీవీ లు రాష్ట్రంలో ఉన్నప్పటికీ, వాటి రిమోట్ మాత్రం హస్తినలోని అధిష్టాణం చేతుల్లోనే ఉంటుందని.. సీల్డ్ కవర్స్ లో వారి పొలిటికల్ ఫ్యూచర్ నిర్ణయించబడుతుందని అంటుంటారు.
అయితే… ఈ తరహా ఆరోపణలను, అపవాదులను చీల్చి చెండాతుతూ అన్నట్లుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడుచుకున్నారని చెబుతారు. “ఢిల్లీ నుంచి ఏమి కావాలో కాదు.. ఢిల్లీకి ఏమి కావాలో అడగండి” అనే స్థాయిలో ఆయన రాజకీయం నడిచిందని అంటారు. “విధేయతకు, బానిసత్వానికీ తేడా ఉంది” అనే విషయాన్ని ఢిల్లీలోని పలువురు పెద్దలకు ఆయన అత్యంత స్పష్టంగా చెప్పారని అంటుంటారు. ఆ సమయంలో… ఆంధ్రాకి హస్తిన అధిష్టాణంలో పెద్ద పీట ఉండేదని చెబుతారు.
ఆయన భౌతికంగా హస్తమించిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైందనే చర్చ నడుస్తోన్న పరిస్థితి. మరోవైపు రాష్ట్రం ఇచ్చిన కృతజ్ఞతతో తెలంగాణ ప్రజలు.. రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని అప్పగించారు. దీంతో, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించింది హస్తినలోని అధిష్టాణం. కట్ చేస్తే… ఇప్పుడు రేవంత్ ఓ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ‘అంతకు మించి’ అనే చర్చ ఇటీవల మొదలవ్వగా.. తాజాగా మరింత బలబడుతోంది.
అవును… రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని ఓ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఆ పార్టీ తరుపున దక్షిణాది గళం కూడా. అంతే కాదు.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వ్యూహకర్తగా అవతరిస్తున్న పరిస్థితి. తాను కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేసే నాయకుడిని కాదు.. సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కార మార్గాలను చూపగలిగే నేతను అంటూ పలు కీలక విషయాల్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు.
ఈ విషయంలో ప్రధానంగా ఓ కీలక విషయం ఉంది. జాతీయ స్థాయిలో అత్యంత కీలక విషయాలైన వాటిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సలహాలు, చూపిన సహేతుకమైన పరిష్కార మార్గాలు వెరసి… జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం దృష్టినే కాదు, దేశంలోని రాజకీయ పార్టీలన్నింటి దృష్టీనీ ఆకర్షించారని చెప్పినా అతిశయోక్తి కాదు. అదే… ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల పునర్విభజన అంశం.
వాస్తవానికి బీజేపీ తెరపైకి తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇది అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తోన్న స్వార్ధపూరిత చర్య అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ… డీలిమిటేషన్ తో కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల సరిహద్దులను మార్చి, తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాలను తమకు అనుకూలంగా పునర్వ్యవస్థీకరించుకునే కుట్ర చేస్తోందన్నారు. కులగణనను విస్మరించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు… డీలిమిటేషన్ కు చెందిన బిల్లు కాపీని తగలబెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. దీన్ని ‘బ్లాక్ బిల్’గా అభివర్ణించారు. దేశాభివృద్ధికి కృషి చేసిన నేరానికి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా..? అని ప్రశ్నించారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో పోరాడుతామని.. కొత్త జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విధంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలన్నీ తమ స్వరాన్ని బలంగా వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో ఈ సమస్యకు తనదైన పరిష్కారంతో అన్నట్లుగా… ‘హైబ్రిడ్ మోడల్’ ను తెరపైకి తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్లిష్టమైన అంశంపై ఆయన ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఎజెండాను అందించింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళనకు ప్రత్యామ్నాయాన్ని రేవంత్ తెరపైకి తెచ్చారు.
ఇందులో భాగంగా… డిలిమిటేషన్ ప్రక్రియలో కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారం.. కేవలం జనాభానే ప్రామాణికంగా తీసుకుంటే.. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని రేవంత్ కీలక వాదనను తెరపైకి తెచ్చారు. అలా అని విమర్శించి ఊరుకోలేదు సుమా…! దీనికి పరిష్కారంగా ఆయన 50:50 ఫార్ములా ను ప్రతిపాదించారు.
అంటే.. డీలిమిటేషన్ లో భాగంగా అదనంగా పెంచే స్థానాల్లో 50 శాతాన్ని జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం, సామాజిక అభివృద్ధి సూచికల ఆధారంగా కేటాయించాలని తెలిపారు. తద్వారా.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు తగిన గుర్తింపు దక్కుతుందని.. అభివృద్ధి చెందినందుకు శిక్ష పడదనే భరోసా కలుగుతుందని ఆయన వివరిస్తున్నారు.
ఈ తాజా వాదన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర పార్టీలకు బూస్ట్ ఇచ్చిందనే చర్చ జరిగింది. ఇదే సమయంలో… దేశవ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు, విశ్లేషకులు, పరిశీలకుల దృష్టిని రేవంత్ ఈ ఒక్క సూచనతో ఆకర్షించగలిగారని అంటున్నారు.
నియోజకవర్గాల విభజనపై క్లారిటీ లేక అయోమయంలో ఉన్న విపక్షాలకు రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారని.. ఫలితంగా, ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్న ప్రభుత్వం ముందు ఒక ప్రత్యామ్నాయాన్ని ఉంచడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఫలితంగా… జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త వ్యూహాలను అందిస్తూ.. ఆ పార్టీ థింక్ ట్యాంకర్ గా రేవంత్ దూసుకుపోతున్నారు.
దీంతో… రేవంత్ రాజకీయ ప్రవాహం గండిపేట నుంచి యమునా నదీ తీరానికి ప్రవహిస్తుందని… నాసికా త్రయంభాకంలో పుట్టిన గోదావరిలా ఉరకలేస్తుందని.. ఆయన తనదైన రాజకీయ వ్యూహాలు, ఆలోచనలతో తన శుక్ర మహర్దశను తానే రాసుకుంటున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కాగా… జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు, మీడియా అటెన్షన్ ని రేవంత్ తనవైపు తిప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించి, విపక్ష నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో చొరవ చూపించారు.
అదేవిధంగా… బీజేపీ 400 సీట్ల నినాదం వెనుక రాజ్యాంగ మార్పు కుట్ర ఉందనే అంశాన్ని బలంగా తెరపైకి తెచ్చి.. దానిపై సాక్షాత్తు ప్రధానమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని సృష్టించిన సంగతి తెలిసిందే. సో… ప్రతిపక్షం అంటే ప్రతిస్పందించడం కాదు ప్రతిఘటించడం అనే సంకేతాలను.. కేవలం విమర్శలే కాదు సహేతుకమైన పరిష్కారాలను అందించాలని కాంగ్రెస్ పార్టీలో మరోసారి బలంగా వినిపించారు!
