చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలించడం కోసమని చెబుతూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో సభలో జరిగిన ఓటింగ్ లో పాల్గొన్న 528 మందిలో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవసరమైన 2/3వంతు మెజార్టీ రాలేదని, అందువల్లే దానిపై తదుపరి కార్యాచరణ చేపట్టడంలేదని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. దీంతో.. బిల్లు ఓడిపోవటంపై ప్రతిపక్షాలు కరతాళ ధ్వనులుచేస్తూ ఆనందం వ్యక్తంచేశాయి.
దీంతో… మహిళలకు న్యాయం చేసే విషయంలో తమ ప్రయత్నాలు ఆగవంటూ అధికార పక్ష తనదైన వెర్షన్ వినిపించింది. మరోవైపు.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఈ సవరణను కేంద్రం తీసుకురాలేదని, భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చడమే దీని వెనక ఉన్న అసలు ఉద్దేశమని విపక్షాలు బలంగా చెబుతున్నాయి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నిజంగా భావిస్తే.. 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో… స్పష్టత లేని డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా.. మహిళా రిజర్వేషన్ బిల్లుని విడిగా ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని విపక్షాలు అన్నీ ప్రకటించాయి. డీలిమిటేషన్ తోనే ముడి పెట్టి, ఈ మహిళా బిల్లును తీసుకుని రావడం వల్లనే ఇలా జరిగిందని స్పష్టత చేశాయి. అయితే… ఈ ఎదురు దెబ్బను సైతం తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమైనట్లున్నారనే చర్చా తాజాగా మొదలైంది.
అవును… మరికొన్ని రోజుల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ప్రధానంగా… పశ్చిమ బెంగాల్ లో మమతా హవాకు బ్రేకులు వేయాలని బలంగా ఫిక్సైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తెరవెనుక ముస్లిం నేతలతో మ్యాజిక్కులు చేస్తుందంటూ త్రుణముల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.. వారి ఆరోపణలు ఇటీవల విడుదలై వైరల్ అయిన వీడియో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
అయితే… తాజాగా లోక్ సభలో మహిళలలకు రిజర్వేషన్లు కలించడం కోసమని చెబుతూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో.. తమ కత్తికి రెండు వైపులా పదునుందన్నట్లుగా.. ఇది మహిళలపై విపక్షాలకు ఉన్న చిన్నచూపు అన్నట్లుగా, తమ చిత్తశుద్ధి తగ్గదు అన్నట్లుగా ప్రచారం చేసుకునే పనులు బీజేపీ మొదలుపెట్టిందని అంటున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో.. తదనంతరం దేశవ్యాప్త ప్రచారానికి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ కల్పించాలనే విషయంలో తమకు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉందని.. అయితే, తమ చిత్తశుద్ధికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని.. బీజేపీ అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బలమైన ప్రచారానికి తెరలేపనుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో… తమకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై పూర్తిస్థాయిలో చిత్తశుద్ధి ఉందని.. అది బీజేపీ కంటే ఎక్కువగానే ఉందని.. అసలు దేశంలో మహిళను ప్రధనమంత్రిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విపక్షాలు బలంగానే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్నాయి. ఇదే సమయంలో.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ & కో నిజంగా భావిస్తే.. 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
దీంతో… డీలిమిటెషన్ విషయంలో బీజేపీ కత్తికి రెండు వైపులా పదునుందా అనే ప్రశ్న తెరపైకి రాగా.. ఆ విషయంలో కాంగ్రెస్ అప్రమత్తంగానే ఉందని.. బలంగానే తమ వెర్షన్ ని వినిపించగలిగిందని.. ‘మహిళలకు రిజర్వేషన్లు’ అనే బిల్లును ముందుపెట్టి… భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయతించిందని.. ఇది మహిళలపై బీజేపీకి ఉన్న కపట ప్రేమ అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు.
మరి ఈ తాజా పరిణామం బీజేపీ, కాంగ్రెస్ లకు రాజకీయంగా ఏ మేరకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించనుందనేది వేచి చూడాలి. ఇదే సమయంలో.. బీజేపీ నేతలకు, ఎన్డీయే కూటమికి మహిళా రిజర్వేషన్స్ పై ఉన్న చిత్తశుద్ధిపై ఆ లోకం ఏమనుకుంటుందనేది వేచి చూడాలి!
