స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం – నిమ్మగడ్డ రమేష్

ఏపీలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టుకు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సాధ్యం కాదని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. బ్యాలెట్‌ బాక్సుల కొరత తీరిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఇంతకు ముందు ఎన్నికలు జరిగిన  చోట్ల ఎక్కడైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో అక్కడ ఎన్నికలను రద్దు చేయాలని ఆయా రాజకీయా పార్టీలు తమను కోరాయని హైకోర్టుకు నివేదించారు. ఈమేరకు ఆయా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు.

అయితే ఈసారి ఎన్నికలు సక్రమంగా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం తమకు తప్పనిసరి అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత అనుభవాలతో పోల్చుతే ఈసారి హింస ఎక్కువగా చోటుచేసుకునే ప్రమాదం ఉందని హైకోర్టుకు విన్నవించుకున్నారు. తనతో పాటు ఎన్నికల కమిషన్‌కు భద్రతను పెంచాలని హైకోర్టును వేడుకున్నారు.

కరోనా కారణంగా గతంలో ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ వాలని కోరారు. బిహార్‌ తో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కొంత మంది వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ హైకోర్టుకు ఈ మేరకు నివేదించారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.