సూపర్ స్టార్ రజనీకి ఈమధ్య వరుసగా ఇబ్బందులు ఎదురావుతూనే ఉన్నాయి. ఆరోగ్యం, సినిమాలు, రాజకీయాలు ఇలా అన్ని కోణాల్లోనూ ఆయన కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘అన్నాత్తే’ సినిమా చేస్తున్నారు. కోవిడ్ కారణంగా ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. గతేడాది హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో చిత్రీకరణ చేస్తుండగా రజినీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సినిమా ఆగిపోయింది. అంతకంటే దారుణంగా ఆయన రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ వరుస సంఘటనలతో రజినీ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చాలా రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్న సూపర్ స్టార్ ఈమధ్యనే షూటింగ్ రీస్టార్ట్ చేశారు.
రజినీ హైదరాబాద్లోనే అనారోగ్యానికి గురికావడం, రాజకీయాలకు స్వస్థి చెప్పాలనే నిర్ణయం తీసుకోవడం జరిగాయి. అలాంటి చోటికే రజినీ షూటింగ్ నిమిత్తం రావడంతో అభిమానులు కాస్త కంగారుపడ్డారనే అనుకోవాలి. వారి ఆందోళనను మరింత పెంచుతూ భాగ్యనగరంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. చిరు, మహేష్, రవితేజ లాంటి పెద్ద హీరోలంతా సినిమాలను నిలిపివేశారు. థియేటర్లు మూతబడ్డాయి. రజినీ సినిమా కూడ రేపో మాపో వాయిదాపడుతుందని అంటున్నారు. అదే జరిగితే ‘అన్నాత్తే’ మరింత ఆలస్యం కావడం ఖాయం. ఇది రజనీకి, ఆయన అభిమానులకు కాస్త ఇబ్బందికరమైన విషయమే.