రాధే శ్యామ్ టీంకు ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌.. ఆనందంలో చిత్ర బృందం

బాహుబ‌లి సినిమాతో త‌న క్రేజ్‌ను దేశ విదేశాల వ‌ర‌కు పెంచుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. కొద్ది రోజుల క్రితం రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన యంగ్ రెబ‌ల్ స్టార్ తాజాగా ఆది పురుష్‌, స‌లార్, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌నున్నాయి. ఇటీవ‌ల స‌లార్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కాగా, ఈ కార్య‌క్ర‌మానికి కేజీఎఫ్ ఫేం య‌ష్ కూడా హాజ‌ర‌య్యాడు.

ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ డం సాధించిన‌ప్ప‌టికీ చాలా ఒదిగి ఉంటారు. త‌న మూవీకి ప‌ని చేసే వారిని ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు. సంక్రాంతి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని రాధే శ్యామ్ సినిమా కోసం ప‌ని చేసిన యూనిట్ అంద‌రికి రిస్ట్ వాచ్ గిఫ్ట్‌గా అందించారు. ఈ గిఫ్ట్ చూసి అంద‌రు ఆనందించారు. ప్ర‌భాస్ మంచి మ‌న‌సుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. గ‌తంలోను ప్ర‌భాస్ ప‌లు గిఫ్ట్స్ అందించారు అంతేకాదు త‌న మూవీ టీం కోసం ఇంటి ద‌గ్గ‌ర నుండి భోజ‌నం తీసుకొచ్చి ఆనందింప‌జేశాడు.

ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన రాధే శ్యామ్ సినిమా కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్ మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. సాహో చిత్రంతో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయిన ప్ర‌భాస్ .. రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం అందించాల‌ని అనుకుంటున్నారు. ఇక స‌లార్, ఆదిపురుష్ చిత్రాలు ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుండగా స‌లార్ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఆది పురుష్ చిత్రాన్ని బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ డైరెక్ట్ చేయ‌నున్నాడు.