గాయకుడు శ్రీ కె.కె. గారు అకాల మరణం బాధాకరం : పవన్ కళ్యాణ్

కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం.

‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’, ‘బాలు’ ‘ఇంతే ఇంతింతే’, ‘జానీ’లో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు… సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం.

ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. శ్రీ కె.కె. గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి.