అఫీషియ‌ల్‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స అందుకున్న ఇస్మార్ట్ భామ‌

సెకండ్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన పింక్ రీమేక్‌గా వ‌కీల్ సాబ్ అనే చిత్రాన్ని చేయ‌గా, ఈ సినిమాను ఏప్రిల్ 9న థియేట‌ర్స్‌లోకి తీసుకొస్తున్నాడు. మ‌రోవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. మ‌రోవైపు సురేంద‌ర్ రెడ్డి, ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోను ప‌వ‌న్ హీరోగా మూవీస్ రూపొంద‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ప‌వ‌న్ 27వ సినిమాగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి ఆస‌క్తిరమైన విష‌యం విడుద‌ల చేశారు మేక‌ర్స్.

ప‌వ‌న్ 27వ సినిమా కోసం చిత్రబృందం ఎప్పటినుండో కథానాయికల కోసం వెతుకుతూనే ఉన్నారు. మధ్యలో బాలీవుడ్ యాక్ట్రెస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇలియానా తదితరుల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో అంద‌రి దృష్టి ఆకర్షించిన నిధి అగ‌ర్వాల్‌ను ఓ హీరోయిన్‌గా క‌న్‌ఫాం చేశారు. మ‌రో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓకే చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ గ‌ల్లా అశోక్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉంది. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డంతో ఎగిరి గంతేసింది.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప‌వ‌న్ 27వ సినిమాను భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ మొఘలుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కోహినూర్ వజ్రం చుట్టూ కథ తిరుగుతుందని.. ఇందులో పవన్ కళ్యాణ్ బంధీపోటుగా కనిపిస్తాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ మ‌ధ్య ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ప్రీ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇది అభిమానుల అంచ‌నాలను రెట్టింపు చేసింది.